రైతు వేదికకు తాళం

ABN , First Publish Date - 2023-07-06T23:54:54+05:30 IST

నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ మండలంలోని గోకారం గ్రామ రైతువేదికకు గురువారం కాంట్రాక్టర్లు తాళం వేశారు.

రైతు వేదికకు తాళం
గోకారంలో రైతు వేదికకు తాళం వేస్తున్న కాంట్రాక్టర్లు

చారకొండ, జూలై 6 : నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ మండలంలోని గోకారం గ్రామ రైతువేదికకు గురువారం కాంట్రాక్టర్లు తాళం వేశారు. గ్రామంలో రైతువేదిక నిర్మించినా నేటికీ బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు రైతువేదిక భవనం వద్ద నిరసన వ్యక్తం చేసి, తాళం వేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు మాట్లాడుతూ అప్పులు తెచ్చి రైతువేదిక నిర్మాణం పూర్తి చేశామని అన్నారు. రూ.22 లక్షలు పెట్టి నిర్మాణం చేపడితే రూ.12 లక్షలు మాత్రమే మంజూరు అయ్యాయని, మిగతా డబ్బుల కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక పోతున్నామని అన్నారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి డబ్బులు వెంటనే వచ్చేలా చూడాలని, లేకపోతే రైతువేదికను తెరవనీయమని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంట్రాక్టర్లు ఎల్లేటి సరిత, సిరిగిరి సైదులు, అంతిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బొడ్డుపల్లి భాస్కరచారి ఉన్నారు.

Updated Date - 2023-07-06T23:54:54+05:30 IST