పాలమూరులో జగన్నాథ రథయాత్ర

ABN , First Publish Date - 2023-06-26T00:04:46+05:30 IST

పాలమూరు పట్ట ణంలో ఆదివారం ఇస్కాన్‌ పాలమూరు శాఖ, ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర కొనసాగింది. స్థానిక పద్మావతి కాలనీ కమాన్‌ నుంచి ప్రారంభమైన యాత్రలో పట్టణంలోని పలువురు ధార్మిక సంఘాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పాలమూరులో జగన్నాథ రథయాత్ర
పాలమూరులో కొనసాగుతున్న రథయాత్ర

మహబూబ్‌నగర్‌ టౌన్‌, జూన్‌ 25: పాలమూరు పట్ట ణంలో ఆదివారం ఇస్కాన్‌ పాలమూరు శాఖ, ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర కొనసాగింది. స్థానిక పద్మావతి కాలనీ కమాన్‌ నుంచి ప్రారంభమైన యాత్రలో పట్టణంలోని పలువురు ధార్మిక సంఘాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పూరి జగన్నాథ రథయాత్రకు ప్రపంచ దేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. అక్కడి యాత్రకు పోలేని వారికోసం గత సంవత్సరం నుంచి ఇస్కాన్‌ పాలమూరుకు చెందిన వారు ఈ యాత్రను ప్రారంభించారు. యాత్రలో భక్తులు కీర్తనలు, నృత్యాలు, భజనలు, కోలాటాలు నిర్వహించి పలువురిని ఆకట్టుకున్నారు. జగన్నాథ్‌ యాత్రను తిలకించేందుకు పట్టణ ప్రజలు ఆసక్తి కనబర్చారు. పలువురు భక్తులు యాత్ర పొడుగున పూజలు నిర్వహించారు. యాత్రకు స్థానిక ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ కేసీ.నర్సింహులు స్థానిక పద్మావతి కాలనీ కమాన్‌ ముందు స్వాగతం పలికారు. యాత్ర మెట్టుగడ్డ, న్యూటౌన్‌, న్యూబస్టాండ్‌, అశోక్‌టాకీస్‌ చౌరస్తా, వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌, రాంమందిర్‌చౌరస్తా, గడియారం చౌరస్తా, పాత బస్టాండ్‌, తెలంగాణ చౌరస్తా, రైల్వేస్టేషన్‌, శెట్టి కాంప్లెక్స్‌ మీదుగా టీటీడీ కల్యాణ మండపానికి చేరుకుంది. యాత్రలో పాల్గొన్న భక్తులు కర్పూర హారతి, పుష్పాలు, జలం సమర్పించారు. యాత్ర టీటీడీ కల్యాణ మండపానికి చేరుకున్న తర్వాత ప్రవచనాలు, మహాహారతి నిర్వహించారు. యాత్ర ముఖ్యోద్ధేశ్యాన్ని ప్రధాన పూజారి కృష్ణకాంతదాసు వివరించారు. అనంతరం భోజన ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా, రథయాత్రలో పాల్గొన్న భక్తులకు, భజన బృందాలకు బిస్లరీ కంపెనీ వారి సౌజన్మంతో మరియు మన పాఠశాల వివేకానంద విద్యానికేతన్‌ పూర్వ ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఘం సహాయ సహకారంతో నిమ్మరసం బాటిల్స్‌ అందించారు.

Updated Date - 2023-06-26T00:04:46+05:30 IST