వినూత్నం.. విభిన్నం
ABN , First Publish Date - 2023-09-26T22:57:11+05:30 IST
నారాయణపేట పట్టు, కాటన్ చీరలు, నాణ్యమైన బంగారానికే కాదు.. గణేష్ ఉత్సవాలకు కూడా ప్రసిద్ధి గాంచింది. నిమజ్జనం సందర్భంగా నిర్వాహకులు రాజకీయ, సామాజిక, సాంకేతిక, ఆధ్యాత్మిక అంశాలపై అలంకరణలు చేసి ఆకట్టుకుంటున్నారు.
నారాయణపేటలో నేటి అర్ధరాత్రి నుంచి వినాయక నిమజ్జనం ప్రారంభం
ఆకట్టుకోనున్న అలంకరణలు
నారాయణపేట, సెప్టెంబరు 26: నారాయణపేట పట్టు, కాటన్ చీరలు, నాణ్యమైన బంగారానికే కాదు.. గణేష్ ఉత్సవాలకు కూడా ప్రసిద్ధి గాంచింది. నిమజ్జనం సందర్భంగా నిర్వాహకులు రాజకీయ, సామాజిక, సాంకేతిక, ఆధ్యాత్మిక అంశాలపై అలంకరణలు చేసి ఆకట్టుకుంటున్నారు. రాష్ట్రంలోని హైదరాబాద్ పెద్ద విగ్రహాలను ప్రతిష్ఠించడంలో ప్రసిద్ధిగాంచితే.. నారాయణపేట జిల్లా కేంద్రంలో మాత్రం నిమజ్జనం సందర్భంగా వినూత్నంగా అలంకరణలు చేస్తారు. 20 గంటల పాటు ఈ వేడుకలు కొనసాగుతాయి. జిల్లా కేంద్రంలోని వాడవాడలో విభిన్న ఆకృతుల్లో వంద వరకు విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్న నిర్వాహకులు బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం రాత్రి వరకు నిమజ్జన వేడుకలను నిర్వహించనున్నారు.
నైజాం పాలన నుంచే..
నారాయణపేట జిల్లా కేంద్రంలో నైజాం పాలన నుంచే గణేష్ సంబురాలు కొనసాగుతూ వస్తున్నాయి. 1940లో మొదటి సారిగా స్వాతంత్య్ర సమర యోధుడైన నాగర్కర్ కిషన్ రావు గణేష్ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారట. ఆ తర్వాత బ్రహ్మణ్వాడి వీధిలోని ప్రజానంద్ దీక్షితుల ఇంట్లో గణపతిని ప్రతిష్ఠించి ఆ రాత్రంత జాగరణ చేసి.. మరుసటి రోజే నిమజ్జనం చేసేవారట. అప్పట్లో పట్టణానికి మహారాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చిన పలువురు వినాయక నిమజ్జన వేడుకలను తమ ప్రాంతంలో ఎలా జరుపుకునే వారో చెప్పేవారట. ఇక అప్పటినుంచి నారాయణపేట వాసులు పదిరోజుల పాటు విగ్రహాలను పూజించి, తర్వాత నిమజ్జనం వేడుకలను నిర్వ హిస్తున్నారు.
కొండారెడ్డిపల్లి చెరువులో వినాయక ఘాట్
నారాయణపేట కొండారెడ్డిపల్లి చెరు వును ట్యాంక్ బండ్గా మారుస్తూ ఎమ్మెల్యే ఎస్ఆర్రెడ్డి రూ.8 కోట్లతో సుందీకరణ పనులు చేపట్టారు. అక్కడే వినాయక ఘాట్ ఏర్పాటు చేయడంతో విగ్రహాల నిమజ్జనానికి చెరువు అనువైన స్థలంగా మారనుంది.