ఎన్నికల్లో ఎన్ని మలుపులో..
ABN , Publish Date - Dec 28 , 2023 | 11:21 PM
2023 సంవత్సరం పాలమూరుకు పలు జ్ఞాపకాలను అందించింది. ఈ ఏడాది రాజకీయాల్లో పాలమూరు జిల్లా చరిత్ర వాసికెక్కింది. జిల్లాబిడ్డ ఎనుముల రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడం ఈ ఏడాదిలో తీపి జ్ఞాపకంగా చరిత్రలో నిలిచిపోయింది.
- ఈ ఏడాదే జిల్లానేతకు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం
- ప్రధాని మోదీ మొదలు కీలక నేతలంతా జిల్లాలో పర్యటన
- మారిన అధికార సీన్
- మహిళా నేతలకు మిశ్రమ ఫలితాలు
- సీనియర్లను వెంటాడిన దురదృష్టం
మహబూబ్నగర్, డిసెంబరు 28 ఆంధ్రజ్యోతి ప్రతినిధి): 2023 సంవత్సరం పాలమూరుకు పలు జ్ఞాపకాలను అందించింది. ఈ ఏడాది రాజకీయాల్లో పాలమూరు జిల్లా చరిత్ర వాసికెక్కింది. జిల్లాబిడ్డ ఎనుముల రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడం ఈ ఏడాదిలో తీపి జ్ఞాపకంగా చరిత్రలో నిలిచిపోయింది. జిల్లాకు చెందిన నాయకుడు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్రెడ్డి మర ణం చేదు జ్ఞాపకంగా మిగిలింది. పదేళ్ల పాటు అధికా రాన్ని చలాయించిన బీఆర్ఎస్ అధికారానికి దూరమైతే, కాంగ్రెస్ నేతలకు అధికారం దక్కింది. మొత్తంగా ఈ ఏడాది రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది.
సీఎం పీఠంపై పాలమూరు బిడ్డ రేవంత్రెడ్డి
పాలమూరు జిల్లాకు 2023 సంవత్సరం ఒక తీపి జ్ఞాపకం. వెనకబడిన జిల్లాగా, కరువు పీడిత ప్రాంతంగా పేరొందిన ఈ జిల్లా నుంచే తెలంగాణ రెండో సీఎంగా కొడంగల్ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్రెడ్డి డిసెంబరు 6వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరించారు. నిజాం పాలన తర్వాత హైదరాబాద్ రాష్ట్రానికి 1952లో షాద్నగర్ ఎమ్మెల్యే బూర్గుల రామకృష్ణారావు సీఎంగా పనిచేస్తే, మళ్లీ డెబ్బైఏళ్ల తర్వాత ఆ అవకాశం రేవంత్కు దక్కింది. ఈ అరుదైన నేపథ్యానికి 2023 సాక్ష్యంగా చరిత్రలో నిలిచింది.
ఈ ఏడాదే అధికార మార్పిడి
తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పాటయ్యాక ఈ ఏడాదే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. పదేళ్లుగా బీఆర్ఎస్ పాలన కొనసాగగా, ఈ ఏడాది చివర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ 14 స్థానాలకు 12 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఘనవిజయం సాధించి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల్లో రేవంత్రెడ్డి ముఖ్య మంత్రి పదవీ బాధ్యతలు చేపడి తే, సీనియర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీక రించారు.
మహిళా నేతలకు మిశ్రమ ఫలితం
జిల్లాలో మహిళానేతలకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. సంవత్సరాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ మహిళా నేతలు డీకే అరుణ, సీతాదయాకర్రెడ్డి, స్వర్ణాసుధాకర్రెడ్డి ఎన్నికల బరిలో నిలవలేదు. ఈ సారి కొత్తగా కాంగ్రెస్ నుంచి గద్వాలలో సరిత, నారాయణపేటలో చిట్టెం పర్ణికారెడ్డి బరిలో నిలిస్తే, సరిత ఓటమిపాలైతే, నారాయణపేటలో చిట్టెం పర్ణికారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు. మహబూబ్నగర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన బీ.స్వప్న ప్రభావం చూపలేకపోయారు. గద్వాల, వన పర్తి జిల్లా పరిషత్ చైౖర్పర్సన్లు సరిత, వనజాగౌడ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరగా, వారిలో సరితకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కినా, గెలువలేకపోయారు. మొత్తంగా ఈ ఏడాది మహిళా నేతలకు మిశ్రమఫలితం దక్కిందనే చెప్పవచ్చు.
పాలమూరును చుట్టేసిన అగ్ర నేతలు
ఈ ఏడాది జిల్లాలో రాజకీయ సందడి కొనసాగింది. పార్టీల అగ్రనేతలు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, బీజేపీ జాతీ య అధ్యక్షుడు జేపీనడ్డా, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్, ఆ పార్టీ లీడర్లు కేటీఆర్, హరీశ్రావు ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. ఎన్నికలకు ముందే ప్రధాని పాలమూరు సభలో పాల్గొంటే, ఎన్నికల సభలో హోంమంత్రి అమిత్షా పాల్గొన్నారు. కల్వకుర్తి, జడ్చర్ల సభల్లో రాహుల్ గాంధీ, గద్వాల, కొడంగల్ సభల్లో ప్రియాంకగాంధీ, అలంపూ ర్, మక్తల్ సభల్లో మల్లికార్జునఖర్గే పాల్గొన్నారు. కేంద్ర మం త్రులు ఆయా నియెజకవర్గాల్లో పాల్గొన్నారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పాలమూరులో పర్యటించారు. కేసీఆర్, రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లాను చుట్టేశారు.
మార్పులతో అదృష్టం, దురదృష్టం
పాలమూరు నేతలకు కొందరికి అదృష్టం కలిసొస్తే, మరికొందరు నేతలను దురదృష్టం వెంటాడింది. వరుసగా ఆరోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ అగ్రనేత తల్లోజు ఆచారిని మరోసారి దురదృష్టం వెంటాడింది. ఆయన ఈ ఎన్నికల్లోనూ స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో ఓటమి పాలై రాజకీయంగా ఎన్నో సంక్షోభాలను, ప్రతిఘటనలను ఎదుర్కొన్న రేవంత్రెడ్డి ఈ ఏడాది చివరలో మళ్లీ కొడంగల్లో గెలవడమే కాకుండా ఏకంగా సీఎం పదవి చేపట్టారు. మరో కీలకనేత జూపల్లి కృష్ణారావు సైతం 2018 ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ తర్వాత బీఆర్ఎస్కు దూరమవడం, ఎన్నికల సమయా నికి కాంగ్రెస్లో చేరడం, మళ్లీ గెలిచి మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఈ ఏడాది వారికి కలిసొచ్చిన అంశాలుగా చెప్పవచ్చు. ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, మరో ఎమ్మెల్సీ కూచు కుళ్ల దామోదర్రెడ్డి బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో చేరగా, నారాయణ రెడ్డి, దామోదర్ తనయుడు రాజేశ్రెడ్డి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. బీజేపీని వీడి కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన యెన్నం శ్రీనివాస్రెడ్డి మహబూబ్నగర్లో విజయం సాధించారు. రాష్ట్ర మంతా ఒక రకమైన వాతావరణం కొనసాగితే, అలంపూర్లో భిన్నమైన సమీకరణలు తెరమీదకు వచ్చాయి. ఇక్కడ కీలకనేత చల్లా వెంకట్రామిరెడ్డి అనూహ్యంగా ఈ ఏడాదిలో బీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. ఆయన శిష్యుడైన బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడు కాంగ్రెస్ నేత సంపత్కుమార్పై ఘనవిజయం సాధించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలు డాక్టర్ నాగం జనార్ధన్రెడ్డి, రావుల చంద్రశేఖర్రెడ్డి ఈ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్లో చేరినా వారు ఆశించిన ఫలితం సాధించలేక పోయారు. మరో దిగ్గజనేత డాక్టర్ మందా జగన్నాథ్ కాంగ్రెస్ గూటికి చేరినా అలంపూర్లో ఫలితం దక్కలేదు. జెయింట్కిల్లర్గా పేరొందిన మాజీమంత్రి జె.చిత్తరంజన్దాస్ జడ్చర్ల నుంచి ఎమ్మెల్యేగా పోటిచేసి ఓటమి పాలయ్యారు. మరోవైపు మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, కీలకనేత సయ్యద్ ఇబ్రహీం బీఆర్ఎస్లో చేరినా వారు ఆశించిన ఫలితాలు సాధించ లేకపోవడం గమనార్హం.