ఐటీ పార్కులో విదేశీ కంపెనీలు
ABN , First Publish Date - 2023-04-21T23:39:17+05:30 IST
మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద వచ్చే నెల ఆరో తేదీన ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించనున్న పాలమూరు ఐటీ పార్కులో అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాకు చెందిన ఐటీ కంపెనీలు అదేరోజు తమ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
అర్హతను బట్టి ఇక్కడి గ్రామాల యువతకే ఉద్యోగావకాశాలు
మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్, ఏప్రిల్ 21: మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద వచ్చే నెల ఆరో తేదీన ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించనున్న పాలమూరు ఐటీ పార్కులో అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాకు చెందిన ఐటీ కంపెనీలు అదేరోజు తమ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. దివిటిపల్లి వద్ద నిర్మించిన ఐదంతస్తుల ఐటీ టవర్ ప్రారంభోత్సవ నేపథ్యంలో కలెక్టర్ జి.రవినాయక్తో కలిసి మంత్రి శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం దివిటిపల్లి వద్ద నూతనంగా నిర్మించిన ఈద్గాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ టవర్ వద్ద మీడియాతో, ఎదిర వద్ద జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. పండుగ వాతావరణంలో ఐటీ టవర్ ప్రారంభిస్తామని, ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 14 లక్షల మంది వలసలు వెళ్లిన పాలమూరు జిల్లాలో నేడు ఐటీ, ఎనర్జీ పార్కుల ఏర్పాటుతో ఇక్కడే కార్పొరేట్ స్థాయి ఉద్యోగాలను భారీగా స్థానిక యువతకు కల్పించనున్నట్లు చెప్పారు. ఇతర దేశాల్లో స్థిరపడిన పాలమూరు యువత కూడా ఇక్కడే మంచి వేతనాలు పొందేలా కంపెనీలు వస్తున్నాయన్నారు. పాలమూరుకు చెందిన విదేశాల్లో స్థిరపడినవారు ఇక్కడ ఐటీ కంపెనీల ఏర్పాటుకు ముందుకొస్తున్నారని తెలిపారు. ఎదిర, దివిటిపల్లి యువతకు వారి విద్యార్హతలకు అనుగుణంగా ఇక్కడి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ సీతారామారావు, మునిసిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ రవి, మార్కెట్ చైర్మన్ రహమాన్ పాల్గొన్నారు.