ఫిర్యాదులను పెండింగ్లో ఉంచొద్దు
ABN , Publish Date - Dec 18 , 2023 | 10:26 PM
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా, సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు.
- కలెక్టర్ వల్లూరు క్రాంతి
- ‘ప్రజావాణి’కి 85 ఫిర్యాదులు
- భూ సమస్యలపైనే అధికం
గద్వాల న్యూటౌన్, డిసెంబరు 18 : ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా, సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశపు హాలులో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి 85 ఫిర్యాదులు వచ్చాయి. అందులో అత్యధికంగా భూ సమస్యలపై 57 ఫిర్యాదులుండగా, ఆసరా పెన్షన్లు ఎనిమిది, ఇతర సమస్యలకు సంబంధించినవి 20 ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, చీర్ల శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు
గద్వాల న్యూటౌన్ : ఓటర్ల సౌకర్యార్ధం పలు పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులకు ప్రతిపాదనలను రూపొందించనున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గాల వారీగా కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఇతర ప్రాంతాలకు తరలించాల్సిన కేంద్రాలు, పేర్ల మార్పు, ఓటర్ల సంఖ్య ఆధారంగా విలీనం అయ్యే కేంద్రాల వివరాలతో కూడిన ప్రతిపాదనలపై కూడిన చర్చించారు. 1400కు పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్ల పరిధిలో కొత్త కేంద్రం ఏర్పాటు, నూతనంగా ఏర్పడిన కాలనీల పరిధిలో కొత్త కేంద్రాల ఏర్పాటు, రెండు కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ దూరంలో కేంద్రం ఉన్న ప్రాంతాలను గుర్తించడం, కొత్త కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మార్పులు, చేర్పులపై ఓటర్లకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రస్తావించిన పలు అంశాలపై కలెక్టర్ వివరణ ఇచ్చారు. అలాగే వారు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అపూర్వ చౌహాన్, చీర్ల శ్రీనివాస్, సీసెక్షన్ సూపరింటెండెంట్ నరేష్, తహసీల్దార్లు మంజుల, విజయకుమార్ పాల్గొన్నారు.
సీఎం సహాయ నిధికి విరాళం
సీఎం సహాయనిధికి విరాళం ఇవ్వడం అభినందనీయమని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. వడ్డేపల్లి మండలం కోయిల్దిన్నె గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు జి.కాంతారెడ్డి సోమవారం రెండు లక్షల రూపాయల డీడీని సీఎం సహాయనిధికి విరాళంగా అందించారు. కలెక్టర్ ఆయనను అభినందించారు.