భక్తుల సహకారంతో అభివృద్ధి పనులు
ABN , Publish Date - Dec 18 , 2023 | 10:29 PM
మల్దకల్ మండల కేంద్రంలోని స్వయంభువు లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల సహకారంతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు.
- మల్దకల్ లక్ష్మీ వేంకటేశ్వరాలయంలో రేపు ప్రారంభించనున్న మంత్రాలయం పీఠాధిపతులు
మల్దకల్, డిశంబరు 18 : మల్దకల్ మండల కేంద్రంలోని స్వయంభువు లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల సహకారంతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ పనులను మంత్రాలయం పీఠాఽధిపతులు సువిదేంద్ర తీర్థ స్వాములు ఈ నెల 20వ తేదీన ప్రారంభించనున్నారు. పనుల వివరా లను ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, కార్యనిర్వహణాధికారి సత్యచంద్రారెడ్డి సోమవారం విలేకరులకు తెలిపారు. బ్రహ్మోత్సవాల నాటికి దేవాలయంలో సప్త ద్వారాలను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అందులో మూడు ద్వారాలకు ఏడు లక్షల రూపాయల చొప్పున ఇచ్చేందుకు దాతలు ముందుకొచ్చారు. మొదటి ద్వారానికి గద్వాలకు చెందిన బాణాల శేషఫణి కుటుంబం, ద్వితీయ ద్వారానికి ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు కుటుంబం, నాలుగవ ద్వారానికి శాంతినగర్కు చెందిన శివశివాని విద్యాసంస్థల యాజమాన్యం ముందుకు రావడంతో పనులు వేగంగా కొనసాగి పూర్తయ్యాయి. అలాగే బిజ్వారం గ్రామానికి చెందిన భక్తుడు, మాజీ మండల ప్రజాప్రతినిధి సత్యారెడ్డి 18 లక్షల వ్యయంతో నిర్మించిన నిత్యాన్నదాన సత్రం ప్రారంభానికి సిద్ధమయ్యింది. వీటిని పీఠాదిపతుల చేతుల మీదుగా బుధవారం ప్రారంభించన్నుట్లు అధికారులు తెలిపారు. అలాగే సప్త ద్వారాలకు సంబంధించి మిగిలిన పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. మరో భక్తుడు క్రిష్ణాజీరావు నిర్మిస్తున్న కల్యాణ మండపం పనులు కూడా శరవేగంగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఆలయానికి 108 కిలోల వెండి సేకరణ దాదాపు పూర్తి దశలో ఉన్నదని చెప్పారు. భక్తుల సహాయ సహకారాలతో దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.