కేసులు పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 23 , 2023 | 10:25 PM
కేసుల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని హైకోర్టు న్యాయమూర్తి సీవీ భాస్కర్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా కోర్టు సముదాయాన్ని శనివారం ఆయన పరిశీలించారు.
హైకోర్టు న్యాయమూర్తి సీవీ భాస్కర్ రెడ్డి
నారాయణపేట టౌన్, డిసెంబరు 23: కేసుల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని హైకోర్టు న్యాయమూర్తి సీవీ భాస్కర్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా కోర్టు సముదాయాన్ని శనివారం ఆయన పరిశీలించారు. అంతకు ముందు కలెక్టర్ శ్రీహర్ష, ఎస్పీ యోగేష్ గౌతమ్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ, సీనియర్, జూనియర్ సివిల్ న్యాయాధికారులు శ్రీనివాస్, ఉమర్, జకియా సుల్తానా భాస్కర్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ఆయన కోర్టు సమూదాయంలోని జిల్లా న్యాయాధికారి, సీనియర్, జూనియర్ సివిల్ న్యాయాధికారుల కోర్టు హాళ్లు, స్టాప్ రూమ్, సెక్షన్ రూమ్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, ఆఫీసర్స్ చాంబర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గదిని పరిశీలించారు. బార్ అసోసియేషన్ చాంబర్లో అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్, సీనియర్ న్యాయాధికారి నాగురావు నామాజీలు హైకోర్టు న్యాయమూర్తిని శాలువా, గజమాలతో సత్కరించారు. అనంతరం జిల్లా న్యాయాధికారి కోర్టు హాల్లో ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్లో జిల్లా ప్రధాన న్యాయాధికారి మహ్మద్ అబ్దుల్ రఫీ నివేదికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా సీవీ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలోని కేసులను పరిష్కరించాలన్నారు. తక్కువ సమయం ఇచ్చి.. కేసులు పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు. హైకోర్టులో బెంచి మీద 30 కేసులు పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. తమ వద్దకు వచ్చిన కేసులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు. జిల్లా కోర్టులో 105 మంది స్టాప్కు 48 మంది ఉన్నారని జిల్లా న్యాయాధికారి తెలిపారు. కోస్గి కోర్టు పరిధిలో స్టెనో లేరని, భవనం శిథిలావస్థకు చేరిందని కోర్టు జూనియర్ సివిల్ న్యాయాధికారి పర్వీన్ బేగం తెలిపారు. స్పందించిన భాస్కర్రెడ్డి జిల్లా కోర్టులతో పాటు హైకోర్టులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.