జములమ్మ ఆలయంలో వేలం పాట
ABN , Publish Date - Dec 14 , 2023 | 10:50 PM
నడిగడ్డలోని జములమ్మ ఆలయంలో ఎండోమెంటు ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ, ఈవో పురేందర్కుమార్ ఆధ్వర్యంలో గురువారం టెంకాయల విక్రయానికి వేలం నిర్వహించారు.
- టెంకాయల విక్రయం, కొబ్బరి చిప్పల సేకరణ వేలంలో రూ.57.45లక్షల ఆదాయం
గద్వాల, డిసెంబరు 14 : నడిగడ్డలోని జములమ్మ ఆలయంలో ఎండోమెంటు ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ, ఈవో పురేందర్కుమార్ ఆధ్వర్యంలో గురువారం టెంకాయల విక్రయానికి వేలం నిర్వహించారు. వేలంలో తొమ్మిది మంది పాల్గొన్నారు. గత ఏడాది 15 నెలలకు రూ.34.35లక్షలు పలికిన వేలం, ఈ ఏడాది రూ. 44.35 లక్షలు పలికింది. ప్రధానంగా పులిపాటి నాగేశ్, తోటరాముడు, సురేష్, రాముయాదవ్ల మధ్య వేలం పాట సాగింది. చివరికి పులిపాటి నాగేశ్ టెంకాయల విక్రయం టెండర్ను దక్కించుకున్నారు. కొబ్బరి చిప్పల సేకరణకు నిర్వహించిన వేలంలో ఆరుగురు పాల్గొన్నారు. రూ. 6.67 లక్షలకు అనీల్ అనే వ్యక్తి దీన్ని దక్కించుకున్నారు. గత ఏడాది కంటే రూ.50 వేలు మాత్రమే అధికంగా వచ్చింది. అదే విధంగా ప్రసాదం విక్రయానికి నిర్వహించిన వేలంలో రాకేష్ అనే వ్యక్తి రూ.6.41 లక్షలకు దక్కించుకున్నాడు. అమ్మవారి చీరల సేకరణకు టెండర్ నిర్వహించగా, ఇద్దరు మాత్రమే డీడీలు కట్టారు. నిబంధనల ప్రకారం ముగ్గురు ఉంటేనే వేలం నిర్వహిస్తామని ఈవో దాన్ని వాయిదా వేశారు. టెండర్ దక్కించుకున్న వారికి జనవరి ఒకటవ తేదీ నుంచి టెంకాయల విక్రయం, కొబ్బరి చిప్పల సేకరణ, ప్రసాద విక్రయం అమలులోకి వస్తుందని ఈవో తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు ఓంప్రకాష్కామ్లే, శంకర్, ఉద్యోగులు మరళీధర్రెడ్డి, సంజీవరెడ్డి, రవిప్రకాష్, రాజలింగం పాల్గొన్నారు.