దశాబ్ది ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు
ABN , First Publish Date - 2023-05-31T23:08:56+05:30 IST
జూన్ రెండో తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.
- ఎస్పీ వెంకటేశ్వర్లు
నారాయణపేట, మే 31 : జూన్ రెండో తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి, మాట్లాడారు. దశాబ్ది ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పోలీస్ శాఖ తరపున జూన్ నాల్గో తేదీన సురక్ష పోలీస్ దినోత్సవం నిర్వహిస్తామని, ఉదయం ఏడు గంటలకు పోలీసులు, పోలీస్ వాహన శ్రేణి, యువకులు, విద్యార్థులతో జిల్లా కేంద్రంలో నిర్వహించే భారీ ర్యాలీకి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పరేడ్ గ్రౌండ్లో, పీఎస్ల పరిధిలో నిర్వహిస్తామని, 12న ఉదయం ఆరు గంటలకు నిర్వహించే తెలంగాణ రన్ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా శాఖల అధికారు లు ఏర్పాటు చేసే కార్యక్రమాలకు భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ కోరారు. అదనపు ఎస్పీ నాగేంద్రుడు, డీఎస్పీ సత్యనారాయణ, వెంకటేశ్వర రావు, ఎస్బీ సీఐ రాంలాల్, సీఐ రవిబాబు, ఎస్ఐలు సురేష్, రాములు, ఆర్ఐలు డేవిడ్, కృష్ణయ్య, డీపీవో సూపరింటెండెంట్ శంకర్లాల్, పాల్గొన్నారు.x