ఏఐసీసీ సభ్యుడిగా పొదెం వీరయ్య
ABN , First Publish Date - 2023-02-21T00:36:39+05:30 IST
అఖిలభారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) సభ్యుడిగా భద్రాద్రి జిల్లా డీసీసీ అధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ నుంచి అధికారిక సమాచారం అందింది. దీంతో జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పొదెం వీరయ్యను అభినందించారు.
భద్రాచలం, ఫిబ్రవరి 20: అఖిలభారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) సభ్యుడిగా భద్రాద్రి జిల్లా డీసీసీ అధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ నుంచి అధికారిక సమాచారం అందింది. దీంతో జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పొదెం వీరయ్యను అభినందించారు. ములుగు జిల్లా, మంగపేట మండలం తొండ్యాల లక్ష్మీపురం గ్రామానికి చెందిన పొదెం వీరయ్య తొలినుంచి కాంగ్రె్సలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా పనిచేశారు. అలాగే ములుగు నియోజకవర్గ బాధ్యులు, పీసీసీ సమన్వయకర్తగా పదవులు నిర్వహించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలో నిలిచిన వీరయ్య ములుగు నుంచి 1999, 2004లో విజయం సాధించగా, భద్రాచలం నుంచి 2018లో ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా గుర్తింపు పొందడంతోపాటు అధిష్టానం నిర్ణయాలను శిరసా వహిస్తుండంతో కాంగ్రెస్పార్టీకి నమ్మినబంటుగా మారారు. ఈ నేపథ్యంలో 2019 అక్టోబరు 24నుంచి భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అలాగే రాష్ట్ర పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తాజాగా ఏఐసీసీ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.