జమున మృతితో సినీ, కళాభిమానుల దిగ్ర్భాంతి

ABN , First Publish Date - 2023-01-28T01:04:47+05:30 IST

‘సినీ సత్యభామ’గా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న అలనాటి.. అందాలనటి జమున మృతితో కళా, సినీ అభిమానులు దిగ్ర్భాంతికి గురయ్యారు. సినీ, రాజకీయ రంగాల్లో మెరిసిన జమునకు ఉమ్మడిఖమ్మం జిల్లాతో అనుబంధం ఉంది.

జమున మృతితో సినీ, కళాభిమానుల దిగ్ర్భాంతి
జమునను హైదరాబాద్‌లో సన్మానిస్తున్న కృష్ణారావు (ఫైల్‌)

పలుమార్లు జిల్లాకు వచ్చిన అలనాటి నటి

జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్న ప్రజలు

ఖమ్మం సాంస్కృతికం/భద్రాచలం, జనవరి 27 : ‘సినీ సత్యభామ’గా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న అలనాటి.. అందాలనటి జమున మృతితో కళా, సినీ అభిమానులు దిగ్ర్భాంతికి గురయ్యారు. సినీ, రాజకీయ రంగాల్లో మెరిసిన జమునకు ఉమ్మడిఖమ్మం జిల్లాతో అనుబంధం ఉంది. ఆమె మిగిల్చివెళ్లిన జ్ఞాపకాలను ఉమ్మడిజిల్లా వాసులు గుర్తుచేసుకుంటున్నారు. 1977నవంబర్‌లో దివిసీమ ఉప్పెన సమయంలో అన్నార్తులకు అండగా ఉండేందుకు దిగివచ్చిన పలువురు సినీతారలతో కలిసి ఆమె జోలెపట్టి విరాళాలు సేకరించేందుకు ఖమ్మం వచ్చారు. నాడు ఖమ్మం జడ్పీసెంటర్‌కు వచ్చిన ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, శోభనబాబు, కృష్ణ, జమున, వాణిశ్రీ తదితర తారలను చూసేందుకు జనం భారీగా తరలొచ్చారు. అలాగే రాజకీయంగా కూడా జమునకు జిల్లాతో అనుబంధం ఉంది. ఆమె కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్న సమయంలో జిల్లాకు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులకు పరిచయం ఉంది. ఎన్నికల సమయాల్లో కూడా ఆమె పలుమార్లు ప్రచార కార్యక్రమాలకు హాజరయ్యారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు అనంత రాములు తదితరులు పోటీచేసిన సమయంలో జమున జిల్లాలోని పలు చోట్ల ప్రచార సభల్లో పాల్గొన్నారు. అదేవిధంగా జమున 2005-06 సంవత్సరంలో భద్రాచలం రామాలయానికి వచ్చి రామయ్యను దర్శించుకున్నారు. ఆమె తన కుమార్తె సీరియల్‌ షూటింగ్‌ నిమిత్తం భద్రాచలం వచ్చిన ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు అప్పట్లో విధులు నిర్వహించిన అధికారులు, ఉద్యోగులు తెలిపారు.

మంత్రి పువ్వాడ, పలువురి సంతాపం

‘సత్యభామ’గా తెలుగు సినీప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిన జమున మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. తెలుగు తెరపైనే కాకుండా అనేక భాషల్లో చెరిగిపోని పాత్రలు ధరించి మెప్పించారన్నారు. రాజకీయ నాయకురాలిగా, ఎంపీగా ప్రజాసేవలో ఆదర్శంగా నిలిచారన్నారు. జమున మృతిపట్ల బీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర వేర్వేరు ప్రకటనల్లో తమ సంతాపం తెలియచేశారు. అలాగే సీనియర్‌ కళాకారులు వీవీ అప్పారావు, నాగబత్తిని రవి జమున మృతికి సంతాపం తెలిపారు. ఇక జమునను నేరుగా చూడటమే కాకుండా, ఆమె సన్మాన సభలో పాల్గొనే అవకాశం తనకు దక్కిందని కవి కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన ఆమె 87వ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడం మరిచిపోలేనిదన్నారు. జిల్లాకు చెందిన వర్దమాన దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ దర్శకుడిగా ఎదుగుతున్న తనను జమున ఎంతో ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు.

Updated Date - 2023-01-28T01:06:26+05:30 IST