అధ్యాపకుల హాజరుతో అక్రమాలకిక చెక్
ABN , First Publish Date - 2023-01-24T23:37:52+05:30 IST
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధ్యాపకుల హాజరులో అక్రమాలను నియంత్రించేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తేనుంది. ఇందుకోసం ముమ్మర ఏర్పాట్లు జరుగుతుండగా.. వాటి పరికరాలు కళాశాలలకు చేరుతున్నాయి.
వచ్చేనెల ఒకటో తేదీ నుంచి జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ అమలుకు నిర్ణయం
నేటికీ అందని పరికరాలు
ఖమ్మం ఖానాపురంహవేలి, జనవరి 24: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధ్యాపకుల హాజరులో అక్రమాలను నియంత్రించేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తేనుంది. ఇందుకోసం ముమ్మర ఏర్పాట్లు జరుగుతుండగా.. వాటి పరికరాలు కళాశాలలకు చేరుతున్నాయి. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెంలో బయోమెట్రిక్ పరికరాల ఏర్పాటు పూర్తవగా.. ఖమ్మం జిల్లాలో ఇంకా మొదలవలేదు. వాటికి సంబంధించిన పరికరాలు నేటికీ అందలేదు. వివరాల నమోదు పూర్తిచేసి ఉన్నతాధికారులకు అందించారు. దీంతో మరో వారంలో ఖమ్మం జిల్లాలో పూర్తిస్థాయిలో బయోమెట్రిక్ అమలు చేయాలని ఇంటర్ విద్యా శాఖ భావిస్తోంది. సమయ పాలనకు ప్రాధాన్యమివ్వాలని బయోమెట్రిక్ ఏర్పాటు చేస్తున్నారు.
ఒకటో తేదీ నుంచి అమలుకు సన్నాహాలు..
ఈ బయోమెట్రిక్ విధానాన్ని వచ్చేనెల ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నారు. తొలుత ఇంటర్ బోర్డు కార్యాలయంలో, ఆ తర్వాత జిల్లా ఇంటర్ విద్యాధికారి (డీఐఈవో), నోడల్ అధికారి కార్యాలయాల్లో అమలు చేస్తుండగా.. ఇకపై కళాశాలల్లోనూ అమలు చేయనున్నారు. అయితే జనవరి 1నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని భావించగా.. అయితే పరికరాల పంపిణీ, ఇన్స్టాలేషన్ ప్రక్రియ ఆలస్యమైంది. వీలైనంత త్వరగా అధ్యాపకులు వేలిముద్రతో హాజరు వేేసలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలోనూ బోధన, బోధనేతర సిబ్బందితోపాటు విద్యార్థులకు ఈ విధానాన్ని అమలు చేశారు. కొవిడ్-19 నేపథ్యంలో వాటిని పక్కన పెట్టారు. అవి తిరిగి వాడుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో కొత్త యంత్రాలను కళాశాలలకు అందజేస్తున్నారు.
గత అక్రమాల నుంచి పాఠాలు నేర్చుకొని..
గతంలో సిబ్బంది హాజరు నమోదులో సమస్యలెదురవడంతో పాటు అక్రమాలు జరిగినట్టు ఇంటర్ బోర్డు గుర్తించింది. హాజరు నమోదు పరికరం చిన్నదిగా ఉండటంతో అధ్యాపకులు వాటిని తామున్న చోటుకు తీసుకెళ్లి వేలి ముద్ర వేసిన సంఘటనలున్నాయి. అంతే కాకుండా వివరాలు నమోదు చేేస క్రమంలో ఒక్కొక్కరివి రెండు బొటన వేళ్లను స్కాన్ చేయాలి. కానీ ఇక్కడ ఒకరిది ఎడమ, మరొకరిది కుడి వేలును స్కాన్ చేసి ఉంచారు. దీంతో ఒక్కరు వెళ్లినా ఇద్దరి హాజరు వేేస అవకాశం ఉండేది. ఇకపై అలాంటి అవకాశం లేకుండా చేశారు. అక్రమాలకు చోటు లేకుండా సాంకేతిక సహాయం తీసుకున్నారు. పకడ్బందీగా ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్ (అబాస్) విధానాన్ని అమలు చేస్తున్నారు.
విధివిధానాల ఖరారుకు కసరత్తు
జిల్లాలో ఇంటర్విద్యాశాఖ కార్యాలయానికి తప్ప ఏఒక్క కళాశాలకు బయోమెట్రిక్ యంత్రాలను అందలేదు. ఇంటర్ బోర్డు నుంచి కళాశాల ప్రధానాచార్యుల వివరాలను నమోదు చేసి పంపిణీ చేయనున్నారు. ఇతర సిబ్బందికి ఐడీని డీఐఈవో, నోడల్ అధికారులు కేటాయించే పనిలో ఉన్నారు. స్థానిక టెక్నికల్ ఇంజినీర్లు వాటిని ఇన్స్టాలేషన్ చేస్తున్నట్టు తెలిసింది. అంతేకాకుండా విధి విధానాలను ఖరారు చేయనున్నారు. ఇదంతా ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని చూస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా అమలుకు మరొక తేదీని ప్రకటించే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు. అతి త్వరలోనే కళాశాలల్లో పని చేసే ప్రధానాచార్యులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది సమయం పాటించే సమయం ఆసన్నమైంది. ఆ తర్వాత విద్యార్థులకు అమలు చేస్తారు.
ఆధార్తో అనుసంధానం..
అధ్యాపకులు, సిబ్బంది ఆధార్ కార్డు నెంబరుతోపాటు ఐడీతో అనుసంధానం చేస్తారు. ఇక ఆధార్ అనుసంధానం చేయడంతో బొటన వేళ్లను కొత్తగా స్కాన్ చేయాల్సిన పని లేదు. మరొకరిది వేసినా అది తీసుకోదు. అంతే కాకుండా డివై్సలో సిమ్ కార్డు ఉంటుంది. ప్రతీ కళాశాలను గతంలోనే జియో ట్యాగింగ్ చేశారు. దీంతో కళాశాలల్లోనే హాజరు నమోదు జరగాలి. మరొక చోటుకు డివైస్ తీసుకెళ్లి వేేస్త ఇట్టే దొరికిపోతారు. జీపీఎ్సతో కళాశాల పరిసరాల్లో ఏ సమయానికి హాజరు వేశారో జిల్లా అధికారులతోపాటు ఇంటర్ విద్యా కమిషనర్ కార్యాలయంలో పర్యవేక్షించే అవకాశముంది. ఇది ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతోంది.
నెలాఖరు వరకు అందుబాటులోకి బయోమెట్రిక్
రవిబాబు, ఖమ్మం జిల్లా ఇంటర్ అధికారి
బయోమెట్రిక్ హజరు విధానం ఈ నెలాఖరుకు జిల్లాలో అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం డీఐఈవో కార్యాలయానికే బయోమెట్రిక్ అందుబాటులో ఉంది. ఇకపై జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలలకు బయోమెట్రిక్ ఏర్పాటు చేసి హాజరులో సమస్యలు లేకుండా చూస్తాం. దీనికి సంభందించిన పరికరాలు మరో రెండు రోజుల్లో రానున్నాయి.