ఏసీబీకి చిక్కిన కోర్ట్‌ కానిస్టేబుల్‌

ABN , First Publish Date - 2023-03-28T01:08:17+05:30 IST

భద్రాద్రి జిల్లా అశ్వాపురం పోలీసుస్టేషన పరిధిలో కోర్టు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న భూక్యా రాంబాబు సోమవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుపడ్డాడు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి కోర్టు వాయిదాల విషయంలో సహకరిస్తానని లంచం డిమాండ్‌ చేయడంతో అతడు ఏసీబీ ఆశ్రయించాడు.

ఏసీబీకి చిక్కిన కోర్ట్‌ కానిస్టేబుల్‌
కోర్టు కానిస్టేబుల్‌ నుంచి ఖమ్మం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.10వేల నగదు

ఓ కేసులో సహకరిస్తానని రూ.15వేల లంచం డిమాండ్‌

కొత్తగూడెం బస్టాండ్‌లో రూ.10వేలు తీసుకుంటూ పట్టుబడ్డ కానిస్టేబుల్‌

కొత్తగూడెం పోస్టాపీస్‌ సెంటర్‌/అశ్వాపురం, మార్చి 27: భద్రాద్రి జిల్లా అశ్వాపురం పోలీసుస్టేషన పరిధిలో కోర్టు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న భూక్యా రాంబాబు సోమవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుపడ్డాడు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి కోర్టు వాయిదాల విషయంలో సహకరిస్తానని లంచం డిమాండ్‌ చేయడంతో అతడు ఏసీబీ ఆశ్రయించాడు. దాంతో ఏసీబీ అధికారులు వలపల్లి సదరు కానిస్టేబుల్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి జిల్లాలోని అశ్వాపురం మండలంలో 2020 సంవత్సరంలో ఓ కేసులో నిందితుడైన అశ్వాపురానికి చెందిన బురక జంపన్న అనే యువకుడు ఇటీవల పోలీ్‌సకానిస్టేబుల్‌ నియామకం కోసం నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించి ప్రధాన పరీక్షకోసం సిద్దమవుతున్నాడు. అయితే అతడిపై ఉన్న కేసువిచారణ కొత్తగూడెం సెషనకోర్టులో కొనసాగుతోంది. ఈ క్రమంలో అశ్వాపురం పోలీ్‌సస్టేషనలో కోర్టు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న భూక్యా రాంబాబు కోర్టు వాయిదాల విషయంలో జంపన్నకు సహకరిస్తానని భరోసా ఇచ్చి రూ.15వేలు డిమాండ్‌ చేశారు. దాంతో జంపన్న ఖమ్మం ఏసీబీ అధికారులను 20రోజుల క్రితం ఆశ్రయించి ఈ విషయమై ఫిర్యాదు చేశాడు. అందులో భాగంగా కానిస్టేబుల్‌ భూక్యా రాంబాబు సోమవారం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్‌లో తొలి విడతగా రూ.10వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుపడ్డాడు. దీంతో ఏసీబీ అధికారులు ఆ కానిస్టేబుల్‌ నుంచి రూ.10వేలు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసి కేసు నమోదు చేసి రిమాండ్‌ నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఈ సంఘటనలో ఏసీబీ ఇనస్పెక్టర్‌ బాలకృష్ణ, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా లంచాన్ని అడిగితే 1064 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన చేయాలని సూచించారు.

Updated Date - 2023-03-28T01:08:17+05:30 IST