యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

ABN , First Publish Date - 2023-06-26T23:51:20+05:30 IST

యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ సూచించారు. సోమవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్‌ వి లక్ష్మీనారాయణ, డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌తో కలిసి అమర్‌చంద్‌ కల్యాణ మండపం నుంచి నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.

యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ

- అదనపు కలెక్టర్‌ వి లక్ష్మీనారాయణ

పెద్దపల్లిటౌన్‌, జూన్‌ 26: యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ సూచించారు. సోమవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్‌ వి లక్ష్మీనారాయణ, డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌తో కలిసి అమర్‌చంద్‌ కల్యాణ మండపం నుంచి నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అమర్‌చంద్‌ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మిషన్‌ పరివర్తన కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్‌ వి లక్ష్మీనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో యువత మంచి, చెడు తెలుసుకుని క్రమశిక్షణతో మెదలాలని అప్పుడే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చన్నారు. యువత డ్రగ్సకు ఆకర్షితులైతే దేశ భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. దీనిని గుర్తించి డ్రగ్స్‌ వల్ల కలిగే విపరీత పరిణామాలపై అవగాహన పెంచుకొని దూరంగా ఉండాలని సూచించారు. చిన్నపిల్లల్లో సెల్‌ఫోన్‌ వాడకం పెరగడం వల్ల ఆలోచనా విధానం మారిపోతుందని, దీనివల్ల అనేక నష్టాలు వస్తున్నాయన్నారు. ఒక పరిణతి వచ్చే వరకు సెల్‌ఫోన్‌ ఇవ్వకపోవడం మంచిదని, ప్రతి ఇంట్లో పిల్లల ఫోన్‌ వాడకంపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని అదనపు కలెక్టర్‌ సూచించారు. యువత డ్రగ్స్‌తో పాటు, గుట్కా, గంజాయి, మాదక ద్రవ్యాలు, సిగరెట్‌ మొదలగు చెడు అలవాట్లకు సైతం దూరంగా ఉండాలన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణ చాలా కీలకమని, వీటిని ఎట్టి పరిస్థితులలో కోల్పోవద్దని ఆయన పేర్కొన్నారు. జిల్లా సంక్షేమ అధికారి రవూఫ్‌ ఖాన్‌ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తన ప్రాణ స్నేహితులు రోడ్డు ప్రమాదంలో మరణించారని, ఎంతో భవిష్యత్తు ఉన్న వారు మాదక ద్రవ్యాల అలవాటుకు లోనై అర్ధాంతరంగా జీవితాన్ని కోల్పోయారని తెలిపారు. అంతకుముందు సాంస్కృతిక సారధి కళాకారులు, సఖీ టీమ్‌ ద్వారా చెడు అలవాట్లకు వ్యతిరేకంగా ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. అనంతరం మాదకద్రవ్యాల నివారణ, డ్రగ్స్‌ నివారణ కోసం రూపొందించిన పోస్టర్లను అదనపు కలెక్టర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్‌ శాఖ అధికారి, జిల్లా సంక్షేమ అధికారి రవూఫ్‌ ఖాన్‌, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌, సఖి సెంటర్‌ అడ్మినిస్ట్రేటర్‌ స్వప్న, డి అడిక్షన్‌ సెంటర్‌ ప్రకృతి ఎన్జీవో ఇన్‌చార్జి ఎ రమాదేవి, కౌన్సిలర్‌ చారీ, పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:51:20+05:30 IST