ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతాం..
ABN , Publish Date - Dec 18 , 2023 | 12:11 AM
ఆరునూరైనా ఆరు గ్యారంటీలను అమలుచేసి తీరుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు అన్నారు.
- కష్టకాలంలో పని చేసిన కార్యకర్తలను ఆదుకుంటాం
- మంత్రి శ్రీధర్బాబు
కరీంనగర్ అర్బన్, డిసెంబరు 17: ఆరునూరైనా ఆరు గ్యారంటీలను అమలుచేసి తీరుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు అన్నారు. ఆదివారం ఆయన కరీంనగర్లో విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా ప్రజలు కాంగ్రెస్పార్టీని అక్కున చేర్చుకుని ఎనిమిది స్థానాల్లో అభ్యర్థులను గెలిపించారన్నారు. ఏ ఆకాంక్షల కోసం ప్రజలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారో వాటిని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచితబస్సు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచామన్నారు. త్వరలోనే మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపడుతామని మేనిఫెస్టోలోనే పెట్టామని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని, వారి మాట ఒక్కటి... చేతలు మరొకటిగా ఉంటాయని అన్నారు. తొమ్మిదేళ్లపాటు బీఆర్ఎస్తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన బీజేపీ నేతలు ఇప్పుడు ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కోరుకున్న మార్పును కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో చూపిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో పనిచేసిన నరేందర్రెడ్డితోపాటు ఇతర నాయకులకు సరైన అవకాశం కల్పిస్తామని, కరీంనగర్ నుంచి పోటీచేసిన పురుమల్ల శ్రీనివాస్కు సహకరించిన అందరినీ గుర్తుపెట్టుకుంటామని మంత్రి శ్రీధర్బాబు హామీ ఇచ్చారు.
ఫ మంత్రికి ఘనస్వాగతం
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబుకు కరీంనగర్లో కాంగ్రెస్శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. మంత్రిగా పదవీ బాద్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా ఆదివారం మంథని నియోజకవర్గానికి కరీంనగర్ మీదుగా వెళుతుండగా కరీంనగర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్వాగతం పలికారు. కేబుల్ బ్రిడ్జి వద్ద వైద్యుల అంజన్కుమార్ మంత్రి శ్రీధర్బాబుకు క్రేన్ సహాయంతో గజమాల వేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వైద్యుల అంజన్కుమార్, సమద్ నవాబ్, కమ్రెద్దీన్, పోతారం సురేందర్, పురుమల్ల శ్రీనివాస్, ఎర్ర శ్రీనివాస్ పాల్గొన్నారు.