‘మన ఊరు- మన బడి’ పనుల్లో వేగం పెంచాలి

ABN , First Publish Date - 2023-05-27T00:06:36+05:30 IST

‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన తరగతి గదుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జడ్పీ డిప్యూటీ సీఈవో గీత ఆదేశించారు.

‘మన ఊరు- మన బడి’ పనుల్లో వేగం పెంచాలి
పనులను పరిశీలిస్తున్న జడ్పీ డిప్యూటీ సీఈవో గీత

ఎల్లారెడ్డిపేట, మే 26: ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన తరగతి గదుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జడ్పీ డిప్యూటీ సీఈవో గీత ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌, నారాయణపూర్‌ గ్రామాల్లోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్న ‘మన ఊరు- మన బడి’ పనులను శుక్రవారం పరిశీలించారు. కార్పొరేటు స్థాయిలో విద్యా ప్రమాణాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ కింద పాఠశాల భవనాల నిర్మాణాలను చేపడుతోందన్నారు. నాణ్యతతో కూడిన పనులను చేయాలన్నారు. సకాలంలో పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకు రావాలని అధికారి గీత అన్నారు. ఎంపీడీవో చిరంజీవి, పీఆర్‌ డీఈ శ్రీనివాస్‌, ఎంపీవో వజీర్‌ అహ్మద్‌, సర్పంచులు బాల్‌రెడ్డి, లక్ష్మీ, నాయకులు శ్రీనివాస్‌, మజీద్‌, మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.

కొనుగోళ్లలో జాప్యం చేస్తే చర్యలు

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తే చర్యలు తప్పవని జడ్పీ డిప్యూటీ సీఈవో గీత హెచ్చరించారు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయం ఆవరణలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. కొనుగోళ్ల తీరును అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో ధాన్యం పేరుకుపోవడంతో ఎందుకు ఆలస్యం జరుగుతోందని నిర్వాహకులను ప్రశ్నించారు. రైతులు ఇబ్బందులు పడకుండా తూకం వేసి వెంటనే రైస్‌ మిల్లులకు తరలించాలని సూచించారు. ఎంపీడీవో చిరంజీవి, ఐకేపీ సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2023-05-27T00:06:36+05:30 IST