నిబంధనలకు నీళ్లు
ABN , Publish Date - Dec 26 , 2023 | 01:17 AM
మండలంలోని ఉల్లంపల్లిలో బీటీ రోడ్డు నిర్మాణంలో నిబంధనలను పట్టించుకకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇష్టారాజ్యంగా రోడ్డు నిర్మాణం
పట్టించుకోని అధికారులు
చిగురుమామిడి, డిసెంబరు 25: మండలంలోని ఉల్లంపల్లిలో బీటీ రోడ్డు నిర్మాణంలో నిబంధనలను పట్టించుకకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలోని సుందరగిరి నుంచి ఉల్లంపల్లి వరకు మూడు కిలోమీటర్ల మేరకు 2.25 కోట్ల నిధులతో రోడ్డు నిర్మిస్తున్నారు. 40 ఫీట్ల వెడెల్పుతో పనులు చేయాల్సి ఉండగా 15 నుంచి 20 ఫీట్లు వెడెల్పు మాత్రమే ఉందని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. ఐదు కల్వర్టులు ఏర్పాటు చేస్తుండగా కొన్నింటిని అవసరం లేని చోట్ల ఏర్పాటు చేస్తున్నారు. కల్వర్టులు నిర్మించిన ప్రదేశంలో రోడ్డు ఇరుకుగా మారింది. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి. కాల్వర్టులకు ప్లాస్టరింగ్ చేసిన తరువాత స్పాంచ్తో క్లీన్ చేయాల్సి ఉండగా సిమెంటు ఖాళీ సంచితో క్లీన్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు పనులను పర్యవేక్షించి నాణ్యతతో జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
నిబంధనలు పాటించడం లేదు..
సయ్యద్ షరీఫ్, ఉల్లంపల్లి
గ్రామానికి బీటీ రోడ్డు మంజూరైందని సంతోషపడ్డాం. కాంట్రాక్టర్ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా పని చేస్తున్నాడు. అధికారులు పట్టించుకోవాలి.
మంత్రికి ఫిర్యాదు చేస్తాం..
కానవేని శివకుమార్, కాంగ్రెస్ నాయకుడు
కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా రోడ్డు నిర్మిస్తున్నాడు. అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోకపోతే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు ఫిర్యాదు చేస్తాం.
పనులు పర్యవేక్షిస్తున్నాం..
రవిప్రసాద్, పంచాయతీ రాజ్ ఏఈ
బీటీ రోడ్డు నిర్మాణంలో ఎలాంటి నాణ్యతా లోపాలు లేవు. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఏవైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురావాలి.