స్వచ్ఛ సర్వేక్షణ్పై వాల్ పెయింటింగ్స్ వేయించాలి
ABN , First Publish Date - 2023-01-25T00:35:32+05:30 IST
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ - 2023పై జిల్లాలో అన్ని గ్రామాల్లో వాల్ పెయింటింగ్స్ వేయించాలని, ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, జనవరి 24: స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ - 2023పై జిల్లాలో అన్ని గ్రామాల్లో వాల్ పెయింటింగ్స్ వేయించాలని, ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్ సముదాయంలోని సమావేశ మందిరంలో సర్వేక్షణ్ గ్రామీణ్ - 2023, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, మన ఊరు - మన బడి, తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు తదితర అంశాలపై ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. సర్వేక్షణ్ గ్రామీణ్ - 2023లో భాగంగా ప్రతీ గ్రామంలో డ్రెయినేజీ ఎండ్ పాయింట్ను గుర్తించాలని, ఇంకుడు గుంతలను నిర్మించాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో ఉన్న టాస్క్ఫోర్స్ బృందాలు గ్రామంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎవరైనా వాడినా, డంప్ చేసినా గుర్తించాలని, బాధ్యులకు జరిమానా విధించాలని అన్నారు. అన్ని మండలాల్లో ఏర్పాటు చేస్తున్న ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్ మెంట్ యూనిట్ల నిర్మాణం పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో నిర్మిస్తున్న టాయిలెట్ల నిర్మాణాల పురోగతిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో వేగం పెంచాలని ఆదేశించారు. కొన్ని గ్రామాలలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు అసంపూర్తిగా ఉన్నాయని, పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడంపై ఎంపీడీవోలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గ్రామాల్లోని సెప్టిక్ ట్యాంకుల నుంచి సేకరించిన వ్యర్థాలను రగుడులోని ఫికల్ స్లడ్జ్ ట్రీట్ మెంట్ ప్లాంట్కు మాత్రమే పంపించేలా చూడాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి .సత్యప్రసాద్, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, డీపీవో రవీందర్, అదనపు డీఆర్డీవో మదన్మోహన్, ఎంపీడీవోలు తదితరుల పాల్గొన్నారు.