రేపు వేములవాడ బంద్
ABN , First Publish Date - 2023-09-22T00:20:22+05:30 IST
వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం ఖజానా నుంచి ఐదు కోట్ల రూపాయల మేరకు నిధులను తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా శనివారం వేములవాడ పట్టణ బంద్ పాటించాలని నిర్ణయించినట్లు జేఏసీ నాయకులు తెలిపారు.
వేములవాడ సెప్టెంబరు 21: వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం ఖజానా నుంచి ఐదు కోట్ల రూపాయల మేరకు నిధులను తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా శనివారం వేములవాడ పట్టణ బంద్ పాటించాలని నిర్ణయించినట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో ఉన్న ఆలయాల అభివృద్ధి కోసం వేములవాడ, యాదగిరిగుట్ట దేవాలయాల నుంచి 10 కోట్ల రూపాయలను కేటాయించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వివిధ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. జేఏసీ నాయకుడు, సీనియర్ అడ్వకేట్ నేరెళ్ల తిరుమల గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పులి రాంబాబు గౌడ్, బహుజన సమాజ్ పార్టీ నాయకుడు తాళ్లపల్లి నాగరాజు, సీపీఐ నాయకుడు కడారి రాములు, అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంటరాజు గురువారం రాత్రి సమావేశమయ్యారు. నిధుల మళ్లింపును అడ్డుకునే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. నిధుల మళ్లింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శనివారం వేములవాడ పట్టణ బంద్ పాటించాలని నిర్ణయించినట్లు సమావేశం అనంతరం తెలిపారు. వ్యాపారులు, వర్తకులు, సామాన్య ప్రజలు శనివారం నాటి బంద్కు సహకరించాలని, ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేసి బంద్ను విజయవంతం చేయాలని కోరారు.