ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ABN , First Publish Date - 2023-09-04T00:13:21+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ సూచించారు.వేములవాడ మండలం చీర్లవంచ గ్రామంలో ఆదివారం ముదిరాజ్ కులస్థులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
- కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్
వేములవాడ టౌన్, సెప్టెంబరు 3: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ సూచించారు.వేములవాడ మండలం చీర్లవంచ గ్రామంలో ఆదివారం ముదిరాజ్ కులస్థులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాలవాంఛను నెరవేర్చిన సోనియాగాంధీకి ఓటు చేసి గౌరవిద్దామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసుగెత్తిపోయారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్య పరచాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మధ్యమానేరు జలాశయంలో ముంపునకు గురైన నిర్వాసితుల సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని అన్నారు. చేతగాని ప్రభుత్వ పాలనతో నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ముంపు గ్రామాల నిర్వాసితులకు ఉపాధి లేక రోడ్డున పడ్డారని ఇప్పటికి వారికి ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వేములవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ బిడ్డగా బరిలో నిలుస్తున్నానని, తనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పిల్లి కనుకయ్య, బీసీ సెల్ మండల అధ్యక్షుడు బోనాల రమేష్ నాయకులు ఈర్నాల గణేష్, కుర్మ రవి, శరత్, పర్శరాములు, కత్తి కనుకయ్య, ఎర్రం ఆగయ్య తదితరులు ఉన్నారు.