రామగుండం కార్పొరేషన్ ఖజానా ఖాళీ
ABN , First Publish Date - 2023-07-21T00:51:08+05:30 IST
రామగుండం నగర ఖజానా ఖాళీ అయ్యింది. కార్పొరేటర్ల గౌరవ వేతనం చెల్లించేందుకు సైతం వెనుకాముందు చూసుకోవాల్సిన పరిస్థితి.
కోల్సిటీ, జూలై 20: రామగుండం నగర ఖజానా ఖాళీ అయ్యింది. కార్పొరేటర్ల గౌరవ వేతనం చెల్లించేందుకు సైతం వెనుకాముందు చూసుకోవాల్సిన పరిస్థితి. కార్మికుల వేతనాలు చెల్లించిన తరువాత ఖజానాలో తగినన్ని నిధులు లేకపోవడంతో రెండు మూడు రోజులు వేచిచూసే పరిస్థితి ఉంది. ఎన్నడూ లేనట్టుగా కార్పొరేషన్ ఖజానా రూ.10లక్షల లోపు పడిపోయింది. మరో పదిరోజుల్లో జూలై నెల వేతనాలు ఔట్ సోర్సింగ్ కార్మికులకు చెల్లించాల్సి ఉంటుంది. వేతనాలు, ఇతర నిర్వహణకే నెలకు రూ.1.5కోట్లు అవసరం ఉంటుంది. పది రోజుల్లో మున్సిపల్ ఖజానాకు కోటిన్నర జమ కావడం గగనమే.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసే 14, 15 ఆర్థిక సంఘం నిధులు, ఎస్సీ సబ్ప్లాన్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైయ్యే పట్టణ ప్రగతి నిధులను వెచ్చిస్తారు. కార్పొరేషన్లో ఏటా సుమారు రూ.10కోట్లు ఆస్థి పన్నుకుతో మరో రూ.5కోట్లు భవన నిర్మాణ అనుమతుల ఫీజులు వసూలు అవతాయి. ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలకు రూ.90లక్షలు, కార్పొరేటర్ల గౌరవ వేతనాలకు రూ.6లక్షలు, ఈఎస్ఐ, ఈపీఎఫ్కు రూ.25 లక్షలు, డీజిల్కు రూ.18 నుంచి రూ.20లక్షలు, కార్ల అద్దెలు, న్యాయవాదుల ఫీజులు ఇతర శానిటేషన్ నిర్వహణకు మరో రూ.15లక్షలు అవసరం ఉంటాయి. మొత్తంగా ప్రతినెలా రూ.1.5లక్షల నుంచి రూ.1.7లక్షల వరకు వ్యయం ఉంటుంది. ఇవన్నీ కార్పొరేషన్ సాధారణ నిధుల నుంచే వెచ్చించాల్సి ఉంటుంది. కార్పొరేషన్కు నేరుగా వచ్చే స్టాంప్ డ్యూటీ, మ్యుటేషన్ ట్యాక్స్, ప్రొఫెషన్ ట్యాక్స్, రాష్ట్ర ఖజానాకు మళ్లించి బదులుగా పట్టణ ప్రగతి క్రింద నిధులు విడుదల చేస్తున్నారు. ప్రతి నెల రూ.80లక్షలు పట్టణ ప్రగతి నిధులు విడుదల చేస్తున్నారు. ఇందులోనే 15వ ఆర్థిక సంఘంకు సంబంధించి అన్టైడ్ నిధులు కూడా ఉంటున్నాయి. ఈ పట్టణ ప్రగతి నిధులనే అభివృద్ధి పనులకు వెచ్చించాలిన పరిస్థితి ఉంది.
టెండర్లు పూర్తయిన పనులకే..
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో పట్టణ ప్రగతి కింద రూ.7కోట్ల నుంచి రూ.8కోట్లు మంజూరై ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పనులు, టెండర్లు పెట్టిన పనులకు బిల్లులు చెల్లించాలంటేనే మరో రూ.3.5కోట్ల లోటు ఉంది. ఇప్పటికి జనవరి కేటాయింపులే విడుదలయ్యాయి. మరో రెండు మాసాల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండడంతో కొత్తగా నిధుల విడుదల గగనమే అనే పరిస్థితి ఉంది. దీనికి తోడు 15వ ఆర్థిక సంఘంకు సంబంధించి అన్టైడ్ నిధులను కేవలం మంచినీటి సరఫరాకు మాత్రమే వెచ్చించాల్సి ఉంది. దీనికి సంబంధించి టెండర్లు పెట్టారు. 14వ ఆర్థిక సంఘంకు సంబంధించి సుమారు రూ.7కోట్లను వాహనాల కొనుగోలుకు వెచ్చించారు. కొత్తగా నిధులే అందుబాటులో లేవు. దీనికి తోడు 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా అమృత్కు జమ చేయాలని మున్సిపల్ శాఖ కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారు. భవిష్యత్లో ఈ నిధులు కార్పొరేషన్కు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. ఈ ఉన్న నిధులు కూడా వినియోగించుకోకుంటే మళ్లించే అవకాశం కూడా ఉంది.
నిధులు లేకున్నా ఒత్తిళ్లు..
రామగుండం నగరపాలక సంస్థలో ఖజానా ఖాళీ అయి పరిస్థితులు అగమ్యగోచరంగా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి కొత్తగా నిధులు మంజూరు కానీ, విడుదల కానీ జరగడం లేదు. ఈ పరిస్థితుల్లో డివిజన్లలో పనుల కోసం ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. కార్పొరేషన్లో సుమారు రూ.35 కోట్ల వరకు పనులకు పాలనాపరమైన ఆమోదాలు తీసుకొని ఉన్నారు. డివిజన్కు రూ.30లక్షల చొప్పున అయినా టెండర్లు పెట్టాలంటూ కార్పొరేటర్లు ఒత్తిడిపెడుతున్నారు. టెండర్లు అయిన పనులకే రూ.3.5కోట్లు లోటు ఉంటే కొత్తగా టెండర్లు పెట్టలేమని అధికారులు చేతులెత్తేశారు. ప్రభుత్వం నుంచి ఈ విషయమై స్పష్టమైన ఆదేశాలు కూడా ఉన్నట్టు తెలుస్తున్నది.