రంజాన్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి
ABN , First Publish Date - 2023-03-16T00:02:43+05:30 IST
రంజాన్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
- మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రంజాన్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రంజాన్ పండుగ ఏర్పాట్లపై పోలీసులు, ముస్లిం, హిందూ మత పెద్దలు, నాయకులతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి ప్రారంభంకానున్న రంజాన్ను శాంతియుతంగా పండుగ వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల సమయంలో మసీదుల వద్ద పరిశుభ్రంగా ఉండేలా సానిటేషన్ పనులు చేయాలని, తాగునీరు ఉండేలా చూడాలని, నల్లానీరు సమయానుసారం సరఫరా చేయాలని, వీధిదీపాలు వెలిగేలా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారిని ఆదేశించారు. కరెంట్ ఇబ్బందులు లేకుండా చూడాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. నైట్ మార్కెట్లు, ఫ్రూట్, వెజిటబుల్ మార్కెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సీపీ సుబ్బారాయుడు మాట్లాడుతూ ఉపవాస దీక్షలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే పోలీసుశాఖ దృష్టికి తీసుకురావాలని ముస్లిం మత పెద్దలకు సూచించారు. ఉపవాస దీక్షలకు పోలీసుశాఖ పక్షాన పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, నగర మేయర్ వై సునీల్రావు, అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్లాఈల్, డీసీపీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, ఎంఐఎం పార్టీ నాయకులు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.