ముగింపు దశకు కొనుగోళ్లు

ABN , First Publish Date - 2023-06-01T00:42:47+05:30 IST

జిల్లాలో యాసంగి సీజన్‌ ధాన్యం కొనుగోళ్లు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే జిల్లాలో పలు కేంద్రాలు వంద శాతం కొనుగోళ్లు పూర్తిచేసి మూతపడ్డాయి.

ముగింపు దశకు కొనుగోళ్లు

- ఇప్పటికే 77 ధాన్యం కొనుగోలు కేంద్రాల మూత

- ఎప్పటికప్పుడు ఖాతాల్లో నగదు జమ

- వారం రోజుల్లో వంద శాతం పూర్తికి యత్నం

జగిత్యాల, మే 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యాసంగి సీజన్‌ ధాన్యం కొనుగోళ్లు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే జిల్లాలో పలు కేంద్రాలు వంద శాతం కొనుగోళ్లు పూర్తిచేసి మూతపడ్డాయి. వచ్చే వారం, పది రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తిచేయడానికి అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ప్రస్తుత సీజన్‌లో జిల్లాలో 4.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అధికారులు అంచనా వేయగా, వాతావరణ పరిస్థితులతో దిగుబడులు తగ్గడంతో ధాన్యం అంచనా మేరకు కేంద్రాలకు రాలేదు.

- 2.98 లక్షల ఎకరాల్లో వరి సాగు..

2023 యాసంగిలో జగిత్యాల జిల్లావ్యాప్తంగా 3.20 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇందుకు గాను జిల్లాలో 4.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్న తొలుత అంచనా వేశారు. ఈ మేరకు జిల్లా ఇందిరా క్రాంతి పథం, సహకార, మార్కెటింగ్‌, మెప్మా తదితర శాఖల ఆద్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏప్రిల్‌ మాసంనుంచి కేంద్రాలను ప్రారంభించి కొనుగోలు జరుపుతున్నారు. దిగుబడులు తగ్గడం వల్ల కేవలం 3.50 లక్షల వరకే ధాన్యం కేంద్రాలకు రానున్నట్లు ప్రస్తుతం గుర్తించారు.

- 3.28 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు...

జిల్లా వ్యాప్తంగా 415 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుపుతున్నారు. ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో 144 కేంద్రాలు, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో 270 కేంద్రాలను, మెప్మా ఆధ్వర్యంలో ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 44,722 మంది రైతుల వద్ద నుంచి రూ. 676.46 కోట్ల విలువ గల 3,28,530 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో రూ. 492.55 కోట్ల విలువ గల 2,39,045 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ట్యాబ్‌ల్లో అప్‌లోడ్‌ చేశారు. రూ. 421.78 కోట్ల విలువ గల 1,81,795 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని లారీల్లో లోడ్‌ చేసి మిల్లర్లకు పంపగా ట్రక్‌షీట్‌ జనరేట్‌ అయింది. ఇందుకు గానూ 14,798 మంది రైతులకు చెందిన 84,180 మెట్రిక్‌ టన్నులకు సంబంధించిన రూ. 173.34 కోట్ల డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన డబ్బులను రైతుల ఖాతాల్లో జమచేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

జిల్లాలోని పలు మండలాల్లో వందశాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసిన 77 కేంద్రాలను అధికారులు మూసివేశారు. ఇందులో 40 ఇందిరా క్రాంతి పథం కేంద్రాలు, 37 సహకార సంఘాల కేంద్రాలు మూతపడ్డాయి. ఈ కేంద్రాల్లో వంద శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయి. జిల్లాలో రానున్న వారం, పది రోజుల్లో అన్ని కేంద్రాల్లో వంద శాతం కొనుగోళ్లు పూర్తవుతాయన్న అంచనాల్లో అధికారులున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కేంద్రాలకు సుమారు మరో 60 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

వంద శాతం పూర్తి చేస్తాం..

- రజనీకాంత్‌, డీఎం, జిల్లా పౌరసరాఫరా శాఖ

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వందశాతం పూర్తి చేస్తాము. చివరి గింజ వరకు కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. వచ్చే వారం, పది రోజుల్లో పూర్తిస్థాయిలో కొనుగోళ్లు పూర్తిచేసే దిశగా పనిచేస్తున్నాము. సకాలంలో ధాన్యం కొనుగోళ్లు చేయడం, ట్యాబ్‌ ఎంట్రీ పూర్తి చేయడం, లారీల్లో లోడింగ్‌ చేయడం, మిల్లర్లకు రవాణా చేయడం, మిల్లుల్లో అన్‌లోడింగ్‌, రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయడం ఇలా దశల వారీగా పనులకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడం వల్లనే కొనుగోళ్లు సకాలంలో పూర్తి చేస్తాము.

Updated Date - 2023-06-01T00:42:47+05:30 IST