కేసులపై సంపూర్ణమైన పట్టు అవసరం
ABN , First Publish Date - 2023-03-18T23:33:06+05:30 IST
కేసు విచారణ సమయంలో ప్రాసిక్యూషన్ ఆయా కేసులపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే సరైన తీర్పులు వస్తాయని ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్(పబ్లిక్ ప్రాసిక్యూటర్) వి వెంకటేశ్వర్లు అన్నారు.

- పీపీలతో కరీంనగర్లో సమావేశం
కరీంనగర్ లీగల్, మార్చి 18: కేసు విచారణ సమయంలో ప్రాసిక్యూషన్ ఆయా కేసులపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే సరైన తీర్పులు వస్తాయని ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్(పబ్లిక్ ప్రాసిక్యూటర్) వి వెంకటేశ్వర్లు అన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అసిస్టెంట్, అడిషనల్ పబ్లిక్ప్రాసిక్యూటర్లతో శనివారం ఆయన జిల్లా కోర్టులో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినెల మొదటి శనివారం పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వారి పరిధిలోని పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించాలని, హాజరుకాని పోలీసు అధికారులపై నివేదిక పంపించాలని తెలిపారు. మూడో శనివారం ఉమ్మడి జిల్లా ప్రాసిక్యూటర్లతో సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. నాల్గవ శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే వర్చువల్ జూమ్ మీటింగ్లో పాల్గొనాలని తెలిపారు. ఈ సందర్భంగా అన్ని కోర్టుల పరిధిలోని పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వృత్తిపరంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి తగు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాల అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు.