మనుషులు కాదు.. వ్యవస్థ శాశ్వతం
ABN , First Publish Date - 2023-05-09T00:21:53+05:30 IST
శాంతి భద్రతలు కాపాడడంలో మనుషులు శాశ్వతం కాదని, వ్యవస్థలు మాత్రమే శాశ్వతమని, ఒక ప్రభుత్వం ప్రజల మేలు కోసం తీసుకువచ్చిన విధానాలు తరువాత ఎవరు వచ్చినా ఆచరించక తప్పదని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
- మంత్రి కేటీఆర్
కోల్సిటీ, మే 8: శాంతి భద్రతలు కాపాడడంలో మనుషులు శాశ్వతం కాదని, వ్యవస్థలు మాత్రమే శాశ్వతమని, ఒక ప్రభుత్వం ప్రజల మేలు కోసం తీసుకువచ్చిన విధానాలు తరువాత ఎవరు వచ్చినా ఆచరించక తప్పదని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన పోలీస్ అధికారులనుద్దేశించి మాట్లాడారు. ప్రజలు శాంతియుత జీవనం గడిపేందుకు దేశ సరిహద్దులు సైనికులు కాపాలా కాస్తుంటే పోలీసులు అంతర్గత భద్రతనిస్తున్నారన్నారు. పోలీసులు ఎంత సేవ చేసినా శభాష్ అనే అభినందనలు తక్కువగా వస్తాయని, అదే సమయంలో చిన్న తప్పు చేసినా శిక్షలు ఉంటాయన్నారు. పోలీసులు విధి నిర్వహణలో ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యుత్ సౌధ ముందు ధర్నా చేస్తున్న సమయంలో ఘర్షణ జరిగి తన చొక్కా చిరిగిందని, ఆ సమయంలో స్టీఫెన్ రవీంద్ర డీసీపీగా ఉన్నారన్నారు. ఈ విషయంపై ఆయన చాలా బాధపడి సారీ చెప్పారని, సాయంత్రానికి తనకు కొత్త చొక్కా పంపారన్నారు. పోలీసులు మానవాతీతులు కాదని, భావోద్వేగాలు ఉంటాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆవేదనతో ఆత్మార్పణ చేసుకున్న కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుందన్నారు. కుమారుడికి ఉద్యోగం ఇవ్వడంతోపాటు కూతురు ప్రియంకను డాక్టర్ చదివించిందన్నారు. ఆమె ప్రస్తుతం కరీంనగర్లోని బస్తీ దవఖానాలో పని చేస్తోందన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ఏర్పాటు అయితే శాంతిభద్రతల సమస్య ఉంటుందని, నక్సలైట్లు, మత ఘర్షణలు ఏర్పడుతాయని, పెట్టుబడులు రావని, నాయకత్వ సమస్య ఉంటుందనే అపోహలను పటాపంచలు చేస్తూ తెలంగాణను దేశంలోనే ఆదర్శవంతంగా నిలిపామన్నారు. గతంలో బెంగాల్ ఏది ఆచరిస్తే దేశం అనుసరిస్తుందనే నానుడి ఉండేదని, ఇప్పుడు తెలంగాణ ఏది అమలు చేస్తే దేశం అనుసరిస్తుందనే పరిస్థితి వచ్చిందన్నారు. పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలకు పెద్దపెద్ద భవనాలు నిర్మించడం అంటే పోలీసుల్లో ఆత్మస్థైర్యం, ప్రజల్లో విశ్వాసం కల్పించడానికేనన్నారు. కమిషనర్ రెమ రాజేశ్వరి రామగుండం పోలీస్ కమిషనరేట్ భవనాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తే వారి బ్యాచ్ అంతా అభినందించిందన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీసింగ్ బెస్ట్ పోలీసింగ్గా నిలుస్తోందని, టెక్నాలజీ, ప్రజలకు మెరుగైన సేవలు, వాహనాలు సమకూర్చడంతో పోలీస్ సంక్షేమ చర్యలు కూడా ఆదర్శంగా నిలిచాయన్నారు. ట్రాఫిక్ పోలీసులకు 30శాతం పొల్యూషన్ అలవెన్సు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణనేనని ఆయన పేర్కొన్నారు. పోలీసులు తక్కువగా కనిపిస్తూ సమర్థవంతంగా సేవలు చేయాలని, శాంతి భద్రతల అంశంలో రాజీపడవద్దని మంత్రి సూచించారు.
అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతి భద్రతలనే అత్యంత ప్రాధాన్య అంశంగా పేర్కొన్నారన్నారు. గతంలో రాష్ట్రంలో రెండు కమిషనరేట్లు ఉంటే ప్రస్తుతం ఏడు కమిషనరేట్లు పని చేస్తున్నాయన్నారు. హైదరాబాద్లో కమాండ్ అండ్ కంట్రోల్ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. డీజీపీ అంజనికుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని, పోలీస్ శాఖకు అత్యధిక నిధులు కేటాయించారన్నారు. శాంతి భద్రతలు బాగుంటే పెట్టుబడులు ఎక్కువగా వస్తాయని, ఉద్యోగ కల్పన జరుగుతుందన్నారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ మాట్లాడుతూ పోలీస్ శాఖను మరింత పటిష్ట పరిచేందుకు ఆధునిక సౌకర్యాల కల్పనకు ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యధిక నిధులు మంజూరు చేశారన్నారు. సీపీ రెమ రాజేశ్వరి తన సందేశాన్నిచ్చారు. కార్యక్రమంలో సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, శాసనమండలి చీఫ్విప్ భానుప్రసాద్రావు, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ రాజీవ్ రతన్, మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్రెడ్డి, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, మనోహర్రెడ్డి, దివాకర్రావు, ఎమ్మెల్సీ రమణ, జడ్పీ చైర్మన్ పుట్ట మధు పాల్గొన్నారు.
- పోలీస్ కమిషనరేట్ భవనం ప్రారంభం
కోల్సిటీ: రామగుండంలో28 కోట్ల రూపాయలతో నిర్మించిన ఆధునిక కమిషనరేట్ భవనాన్ని హోంమంత్రి మహమూద్ అలీ సోమవారం ప్రారంభించారు. రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, మండలి చీఫ్విప్ భానుప్రసాద్రావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, డీజీపీ అంజనికుమార్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ రాజీవ్ రతన్, ఐజీ చంద్రశేఖర్రెడ్డి, కమిషనర్ రెమ రాజేశ్వరి, ఎంపీ వెంకటేష్నేత, కలెక్టర్ సంగీతసత్యనారాయణ, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, మనోహర్రెడ్డి, దివాకర్రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు విభాగాలను మంత్రులు ప్రారంభించారు. అనంతరం పోలీస్ కమిషనర్ చాంబర్లో తమ సందేశాలను రికార్డు చేశారు.