ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలకు అవకాశాలు
ABN , First Publish Date - 2023-06-05T23:53:38+05:30 IST
ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలకు మెరుగైన అవకాశాలు వస్తాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు.
సుభాష్నగర్, జూన్ 5: ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలకు మెరుగైన అవకాశాలు వస్తాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. సోమవారం కరీంనగర్లోని రెవెన్యూ గార్డెన్లో ఉమ్మడి జిల్లా మాదిగల సన్నాహక సభను నిర్వహించారు. ఈ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లు మాదిగలకు దక్కింది ఐదు సంవత్సరాలేనని అన్నారు. మిగతా 70 సంవత్సరాలలో అరకొరగానే దక్కాయన్నారు. 1994లో వర్గీకరణ కోసం మాదిగ దండోరా ప్రారంభమైందని తెలిపారు. 2000 సంవత్సరం వరకు ఉమ్మడి రిజర్వేషన్లే అమలయ్యాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జనాభాకు తగ్గట్లుగా రిజర్వేషన్లు అమలు కావడం లేదన్నారు. వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బిల్లు పెట్టలేదని పిలుపునిచ్చారు. వర్గీకరణే లక్ష్యంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బెజ్జంకి అనిల్, మంద దేవేంద్ర ప్రసాద్, ఇంజం వెంకటస్వామి, బుర్రి సతీష్, దండు అంజయ్య, తడగొండ శంకర్, కొత్తూరి రాజన్న, తుంగ ఆంజనేయులు, చెంచాల నవీన్, సురుగు శ్రీనివాస్ పాల్గొన్నారు.
దివ్యాంగులకు రూ. ఆరు వేల పెన్షన్ ఇవ్వాలి
దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు జక్కం సంపత్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంద కృష్ణ మాదిగ పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు పెన్షన్ పెంచడంతోపాటు చట్ట సభల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేద దివ్యాంగులకు అంత్యోదయ కార్డులు ఇవ్వాలన్నారు. దివ్యాంగులకు సంబంధించిన ప్రధాన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం పెరుగుతున్న బడ్జెట్కు అనుగుణంగా పెన్షన్ పెంచాలని కోరారు.