త్వరలో జాతీయ రహదారి పనులు
ABN , First Publish Date - 2023-01-10T00:38:58+05:30 IST
కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి (ఎన్హెచ్-563) రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
హుజూరాబాద్, జనవరి 9: కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి (ఎన్హెచ్-563) రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లిస్తున్నారు. హుజూరాబాద్ ప్రాంతం నుంచి వెళ్తున్న నేషనల్ హైవే బైపాస్ సర్వే పనులు ఎప్పుడో పూర్తయ్యాయి. సర్వే జరిగిన రైతులకు డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని శంకరపట్నం, హుజూరాబాద్ మండలాలు వస్తాయి. భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. హుజూరాబాద్, శంకరపట్నం మండలాల్లో 26.13 కిలో మీటర్లలో జాతీయ రహదారి ఉంది. ఇందులో 10 గ్రామాలుండగా, 890 మంది రైతులు భూములు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు సగం మంది రైతులకు రెవెన్యూ డివిజన్ కార్యాలయం నుంచి 36.74 కోట్ల రూపాయలు చెల్లించారు. మొదట్లో హుజూరాబాద్ డివిజన్లోని రైతులు బైపాస్కు భూములు ఇవ్వమని ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. ఆర్డీవోకు వినతి పత్రాలు సమర్పించారు. చివరికి అధికారులు పోలీసులతో సర్వే పనులు పూర్తి చేసి, ప్రభుత్వానికి నివేదిక పంపించారు. దీని ఆధారంగా భూములు కోల్పోతున్న రైతులకు నిధులు మంజూరయ్యాయి. హుజూరాబాద్ మున్సిపాలిటీ కావడంతో రంగాపూర్, పెద్దపాపయ్యపల్లి, రాంపూర్ గ్రామాల్లో భూములకు లక్షల్లో డిమాండ్ ఉంది. ప్రభుత్వం మాత్రం నామమాత్రంగా డబ్బులు చెల్లిస్తోది.
ఫ రైతుల ఖాతాల్లో రూ. 36.74 కోట్లు జమ చేశారం
- బి హరిసింగ్, ఆర్డీవో, హుజూరాబాద్
నేషనల్ హైవే కింద భూములు కోల్పోయిన రైతుల ఖాతాల్లో 36.74 కోట్ల రూపాయలుజమ చేశాం. రమదారి నిర్మాణంలో 894 మంది రైతులు భూములు కోల్పోతున్నారు. ఇందులో 460 మందికి డబ్బులు చెల్లించాం. మిగితా వారికి కూడా త్వరలోనే చెల్లిస్తాం.