కదలిన జనం.. కబ్జాపై కన్నెర్ర

ABN , First Publish Date - 2023-06-03T00:33:11+05:30 IST

మండలంలోని అల్మాస్‌పూర్‌ గ్రామ శివారులోని రంగం చెరువుతో పాటు అటవీ ప్రాంతాన్ని కొందరు వ్యక్తులు చదును చేస్తూ అక్రమణకు పాల్పడుతున్నారని పేర్కొంటూ శుక్రవారం సుమారు 400 మంది గ్రామస్థులు, రైతులు, మహిళలు కలిసి కట్టుగా తరలి వెళ్లారు.

కదలిన జనం.. కబ్జాపై కన్నెర్ర
ఆందోళన చేస్తున్న గ్రామస్థులు

- చెరువు ఆక్రమణపై ఆందోళన - పనుల అడ్డగింత

ఎల్లారెడ్డిపేట, జూన్‌ 2: మండలంలోని అల్మాస్‌పూర్‌ గ్రామ శివారులోని రంగం చెరువుతో పాటు అటవీ ప్రాంతాన్ని కొందరు వ్యక్తులు చదును చేస్తూ అక్రమణకు పాల్పడుతున్నారని పేర్కొంటూ శుక్రవారం సుమారు 400 మంది గ్రామస్థులు, రైతులు, మహిళలు కలిసి కట్టుగా తరలి వెళ్లారు. భారీ వాహనాలతో మట్టిని చదును చేస్తున్న పనులను అడ్డుకున్నారు. చెరువు, అటవీ భూమిలో ఎలా పనులు చేస్తారంటూ ఆందోళనకు దిగారు. అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు పలుకుబడితో 20 ఎకరాల చెరువు, అటవీ భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. దర్జాగా పనులు చేస్తున్న సంబంధిత శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. చెరువు భూమిని చదును చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో తహసీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని గ్రామస్థులు హెచ్చరించారు. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి, మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలోని నాయకులు అక్కడకు చేరుకుని గ్రామస్థుల ఆందోళనకు మద్ధతు తెలిపారు. చెరువు, అటవీ భూముల కబ్జాపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నామని పేర్కొన్నారు. అక్రమణకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుని చెరువు, అటవీ భూములను కాపాడాలని లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Updated Date - 2023-06-03T00:33:11+05:30 IST