సుపరిపాలనతో అన్ని రంగాల్లో ముందంజ
ABN , First Publish Date - 2023-06-11T00:22:14+05:30 IST
ప్రజలకు సుపరిపాలన అందిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని రంగాల్లో ముందంజలో ఉందని జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు.
సిరిసిల్ల, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు సుపరిపాలన అందిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని రంగాల్లో ముందంజలో ఉందని జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో తెలంగాణ సుపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో నూతనంగా ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ విధానాన్ని కలెక్టర్ అనురాగ్ జయంతి, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్బాబు ప్రారంభించారు. జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల ధశరథం, జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారి పీబీ శ్రీనివాసచారి అభివృద్ధిపై రూపొందించిన లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పనిచేస్తేనే జిల్లా సమగ్ర అభివద్ధి సాధ్యమవుతుందన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలపాలని సూచించారు. వేములవాడ ఎమ్మెల్యే రమేష్బాబు మాట్లాడుతూ స్వయం పాలనలో సుపరిపాలన సౌరభాలను ప్రతీ గడపకు చేరేలా ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనతోనే ఆశించిన లక్ష్యాన్ని సాధించవచ్చన్నారు. సుపరిపాలన అంటే అధికారులకు మాత్రమే పరిమితమైన అంశమని కొందరు భావిస్తారని, పరిపాలన సంస్కరణలో రాజకీయ నేతల పాత్ర ఎనలేదని అన్నారు. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు కలిస్తేనే ఫలితాలు వస్తాయన్నారు. టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ మాట్లాడుతూ స్వరాష్ట్రంలో ప్రభుత్వ సేవలు సులభంగా వేగంగా పొందగలుగుతున్నారన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు, ఉద్యోగులు పునరంకితం కావాలన్నారు. కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ భూమి చుట్టూ అల్లుకున్న సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ధరణిని తెచ్చిందన్నారు.ఽ దరణితో భూ లావాదేవీలు సులభంగా వేగంగా చేయడంతోపాటు పారదర్శకంగా ఉంటోందన్నారు. జిల్లాలో వివిధ కేటగిరీల్లో 37 వేల భూ సమస్యలను ఆన్లైన్ విధానంలో పరిష్కరించామన్నారు. తొమ్మిది మండలాలు 13 మండలాలుగా పెరగడం, కొత్తగా వేములవాడను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయడంతో ప్రజలకు అనేక విధాలుగా మేలు జరిగిందన్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పడిన 56 గ్రామ పంచాయతీలతో ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగిందని, సేవలు కూడా పెరిగాయని అన్నారు. జిల్లాలో టీఎస్ఐపాస్ ద్వారా 8 వేల మందికి ఉపాధి లభించిందన్నారు. ఎస్పీ అఖిల్మహాజన్ మాట్లాడుతూ దేశంలోనే ఫ్రెండ్లీ పోలీసింగ్గా తెలంగాణ పోలీసులకు మంచి గుర్తింపు ఉందన్నారు. పాస్పోర్టు వెరిఫికేషన్లో తెలంగాణ ముందుందని ప్రభుత్వ సహకారం పోలీసుల కృషితో తెలంగాణలో శాంతి భద్రతలు బాగున్నాయని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్, ఖీమ్యానాయక్, ఆర్డీవో శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఆకునూరి శంకరయ్య, రైతుబంధు సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, సీపీవో శ్రీనివాసచారి, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.