కొండా లక్ష్మణ్‌ బాపూజీ స్ఫూర్తితో నేతన్నలకు చేయూత

ABN , First Publish Date - 2023-01-11T00:29:31+05:30 IST

ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం నేతన్నల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి కే తారకరామరావు అన్నారు.

కొండా లక్ష్మణ్‌ బాపూజీ స్ఫూర్తితో నేతన్నలకు చేయూత
విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి కేటీఆర్‌

తంగళ్లపల్లి, జనవరి 10: ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం నేతన్నల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి కే తారకరామరావు అన్నారు. మంగళవారం తంగళ్లపల్లి మండల కేంద్రంలో మార్కండేయ దేవాలయం సమీపంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆచార్య కొండ లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆచార్య బాపూజీ విగ్రహం ఆవిష్క రించడం ఆదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నేతన్నల సంక్షేమం కోసం చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, నేతన్నబీమా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. బతుకమ్మ చీరలతో నేతన్నలకు బతుకుదెరువు నిచ్చినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రూ.70 కోట్లు ఉన్న బడ్జెట్‌ను తెలంగాణ ప్రభుత్వం రూ.1200 కోట్లకు పెంచి వారి సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. బాపూజీని గత ప్రభుత్వం జలదృశ్యం నుంచి వెళ్లగొట్టిందని తెలంగాణ ప్రభుత్వం అక్కడే కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహం ఏర్పాటు చేసి గౌరవించిందని అన్నారు. కొండాలక్ష్మణ్‌ బాపూజీ పేరు మీద ఆర్టికల్చర్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని. చేనేత దినోత్సవం రోజు బాపూజీ పేరు మీద చేనేత కళాకారులకు నగదు పురస్కా రాలను అందిస్తున్నామని అన్నారు. అనంతరం 143 సంఘం అనుబంధంగా ఏర్పడిన ప్రెస్‌క్లబ్‌ కార్యాలయాన్ని ప్రారం భించారు. ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ అరుణ, జడ్పీటీసీ పూర్మాణి మంజుల లింగారెడ్డి, పద్మశాలి సంఘం అధ్యక్షుడు రాపెల్లి ఆనందం, 143 సంఘం అధ్యక్షుడు ఎనగందుల శ్రీనివాస్‌, ప్రజాప్రతినిధులు, నాయకులు, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-11T00:29:39+05:30 IST