Share News

కేసీఆర్‌ అంటే నమ్మకం.. కాంగ్రెస్‌ గ్యారంటీలు బూటకం

ABN , First Publish Date - 2023-11-16T23:37:12+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంటే ప్రజల్లో ఒక నమ్మకం, ఆయన నాయకత్వంలోనే తెలంగాణకు భవిష్యత్‌కు ఉంటుందని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కాంగ్రెస్‌ చెబుతున్న ఆరు గ్యారంటీలు బూటకమని ఆయన విమర్శించారు. గురువారం రాత్రి నగరంలోని 41, 43 డివిజన్ల పరిధిలోని వావిలాలపల్లి, సవరన్‌స్ర్టీట్‌లో ప్రచారం నిర్వహించారు.

కేసీఆర్‌ అంటే నమ్మకం.. కాంగ్రెస్‌ గ్యారంటీలు బూటకం
ప్రచారంలో మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్‌

- కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ఎప్పుడైనా మీకు కనిపించారా..

- ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పండి

- బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ టౌన్‌, నవంబర్‌ 16: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంటే ప్రజల్లో ఒక నమ్మకం, ఆయన నాయకత్వంలోనే తెలంగాణకు భవిష్యత్‌కు ఉంటుందని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కాంగ్రెస్‌ చెబుతున్న ఆరు గ్యారంటీలు బూటకమని ఆయన విమర్శించారు. గురువారం రాత్రి నగరంలోని 41, 43 డివిజన్ల పరిధిలోని వావిలాలపల్లి, సవరన్‌స్ర్టీట్‌లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌కు ఆయా కాలనీలవాసులు, ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతో మీ ఆశీర్వాదంతో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, మంత్రిగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరారు. మట్టి రోడ్లు అనేవి లేకుండా కరీంనగర్‌లో, గ్రామాల్లో బీటీ, సీసీ రోడ్లు వేశామని చెప్పారు. ప్రతి ఇంటికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తున్న కేసీఆర్‌ నాయకత్వాన్ని మరోసారి బలపర్చాలని విజ్ఞప్తి చేశారు. గ్యారంటీ లేని ఆరు గ్యారంటీలతో వస్తున్న కాంగ్రెస్‌ను నమ్మితే మళ్లీ తెలంగాణలో చీకటి రోజులు వస్తాయని, ఆలోచించాలని కోరారు. అధికారంలోకి రాకముందే టికెట్లు అమ్ముకుంటున్న కాంగ్రెస్‌ నాయకులు, ఒక వేళ అధికారంలోకి వస్తే రాష్ర్టాన్ని అమ్ముకుంటారని, అభివృద్ధి మొత్తం ఆగిపోతుందని, సంక్షేమ పథకాలు నిలిచిపోతాయన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా నిత్యం మీ మధ్యనే ఉంటూ మంచి, చెడులో, కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్న తనను మీ బిడ్డగా ఆశీర్వదించాలని, అబ్బురపరిచే విధంగా కరీంనగర్‌ను అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని కమలాకర్‌ హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు ఏనాడైనా ప్రజా సమస్యలను, అభివృద్ధిని చేశారా, వారిని మీరెప్పుడైనా చూశారా, ఎన్నికలు అయిపోతే ఇకవారు కనిపించరని అలాంటివారికి ఓటు ఎలా వేస్తారని, ఆలోచించి ఓటు వృథా కాకుండా కారు గుర్తుపై వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ అధికారంలోకిరాగానే రూ.400లకే వంట గ్యాస్‌ సిలిండర్‌, సౌభాగ్యలక్ష్మి పేరుతో అర్హులైన మహిళలకు నెలకు రూ.3వేలు, కేసీఆర్‌ ఆరోగ్యబీమాతో కేసీఆర్‌ ప్రభుత్వం అండగా నిలుస్తుంది.. ఆలోచించి ఓటు వేయాలని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌ చేతిలోనే ఉంటేనే మన బిడ్డల భవిష్యత్‌ బాగుంటుందని అన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇంతకు రెట్టింపు కావాలంటే మళ్ళీ కేసీఆర్‌ సీఎం కావాలి.. అందుకు మనమంతా కారు గుర్తుకు ఓటు వేయాలని అన్నారు. కేసీఆర్‌ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌ భరోసా ఇచ్చిన హామీలన్నిటిని అమలు చేస్తామని, రాష్ట్రంలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు మరే ఈ ఇతర రాష్ట్రంలో అమలు చేయడం లేదని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణి, రైతుబంధు ఉండదు.. 24 గంటల కరెంటుకు బదులు మూడు గంటల కరెంటు ఇస్తామని ఆ పార్టీ నేతలు చేబుతున్నారు. మూడు గంటలు కరెంటిస్తే అన్నం పెట్టే రైతులు తీవ్రంగా నష్టపోతారని, రైతుకు మేలు చేస్తే బీఆర్‌ఎస్‌ పార్టీని ఆదరించాలని కోరారు. 60 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌ నాయకులు తెలంగాణ ప్రాంతాన్ని, కరీంనగర్‌ను అసలు పట్టించుకోలేదని, అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఇక్కడి రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సరఫరా, వీధిదీపాలు ఎలా ఉండేవని, కేసీఆర్‌ నాయకత్వంలో పదేళ్లలో ఎంత అభివృద్ధి చేశామో ఒక్కసారి ఆలోచించాలని కోరారు. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాల అమలు చేస్తూ, ఇంకోవైపు వేంకటేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. టీటీడీ కరీంనగర్‌లో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మిస్తోందని, ఇకపై మనకు తిరుపతి భాగ్యం ఇక్కడే లభిస్తుందని అన్నారు. మానేరు రివర్‌ ఫ్రంట్‌, తీగలవంతెన, ఇస్కాన్‌ శ్రీకృష్ణ టెంపుల్‌, ప్రభుత్వం వైద్య కళాశాల పనులు పూర్తిచేసి పర్యాటకరంగంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కళ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి తనను మరోసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిగా కరీంనగర్‌ను అద్భుతంగా అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటానన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ కల్లబొల్లి మాటలు, అసత్యపు ప్రచారాలతో ఓట్ల కోసం వస్తున్నారని, ఇన్నాళ్లు కనిపించకుండా పోయిన ఆ పార్టీ నాయకులను నిలదీసి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ మన సమస్యలన్నిటిని పరిష్కరిస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌ కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మేయర్‌ సునీల్‌రావు అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బండారి వేణు, సరిళ్ల ప్రసాద్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Updated Date - 2023-11-16T23:37:16+05:30 IST