ప్రజల రుణం తీర్చుకుంటా.. సేవకుడిలా పని చేస్తా
ABN , First Publish Date - 2023-12-11T00:12:08+05:30 IST
తనను భారీ మెజార్టీతో గెలిపించి, అసెంబ్లీకి పంపించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని, నిత్యం అందుబాటులో ఉండి సేవకుడిలా పని చేస్తానని ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ధర్మపురి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటి సారిగా ధర్మపురి నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.
- ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్
ధర్మపురి, డిసెంబరు 10: తనను భారీ మెజార్టీతో గెలిపించి, అసెంబ్లీకి పంపించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని, నిత్యం అందుబాటులో ఉండి సేవకుడిలా పని చేస్తానని ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ధర్మపురి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటి సారిగా ధర్మపురి నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ధర్మపురి మండలంలోని రాయపట్నం, బూరుగుపల్లె, తిమ్మాపూర్, రామయ్యపల్లె మీదుగా ధర్మపురి చేరుకున్న ఆయనకు ఆయా కూడళ్ల వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ధర్మపురి వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడి నుంచి ఆయన హనుమాన్వీధి, చింతామణి చెరువు, నందిచౌక్, ఇసుక స్తంభం, దేవాలయం, ముదిరాజ్వాడ మీదుగా పటేల్ గార్డెన్స్ వరకు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. అనంతరం పటేల్ గార్డెన్స్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా కార్యకర్తలు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు అన్ని రంగాల్లో దగా పడ్డారని ఆయన ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన ప్రజలు ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారని ఆయన అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాల్లో రెండు అమలు చేశామన్నారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారని ఆయన పేర్కొన్నారు. తనపై ప్రేమ, విశ్వాసంతో ఎన్నికల్లో ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలను మరవలేనని ఆయన అన్నారు. నిత్యం ఇక్కడే ప్రజల మధ్య ఉండి మీలో ఒక్కడిగా ఏ ఆపద వచ్చిన వెంటనే స్పందించి ఆదుకుంటానని ఆయన తెలిపారు. ఎక్కడ సమస్య ఉన్నా నేరుగా తన వద్దకు వచ్చి పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. అంతకు ముందు లక్ష్మణ్కుమార్ తిమ్మాపూర్లో ధర్మపురి దేవస్థానం మాజీ చైర్మన్, సీనియర్ రాజకీయ నాయకులు జువ్వాడి సూర్యారావు ఇంటికి వెళ్లారు. ఎన్నికల్లో తన గెలుపు కోసం తీవ్ర కృషి చేసినందులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి, ఆశీర్వచం పొందారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వేముల నాగలక్ష్మి-రాజేష్, జక్కు పద్మ-రవీందర్, గరిగె అరుణ-రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కుంట సుధాకర్, మండల ఉపాధ్యక్షుడు వేముల రాజేష్, ఏఎంసీ మాజీ చైర్మన్ గడ్డం భాస్కర్రెడ్డి, మండల ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ రెడ్డవేని సత్యం, ఎంపీటీసీలు తోడేటి గంగాధర్, గోపతి పుష్పల, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్, యువజన కాంగ్రెస్ నియోజ కవర్గ అధ్యక్షుడు సింహరాజు ప్రసాద్, మండల అధ్యక్షులు రాందేని మొగిలి, పట్టణ అధ్యక్షులు అప్పం తిరుపతి పాల్గొన్నారు.