నిరుపేదలకు వరం గృహలక్ష్మి పథకం

ABN , First Publish Date - 2023-09-22T00:21:41+05:30 IST

నిరుపేదలకు వరం గృహలక్ష్మి పథకమని, కరోనా కారణంగానే ఆలస్యమైందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

నిరుపేదలకు వరం గృహలక్ష్మి పథకం
లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ అందిస్తున్న నాయకులు

జగిత్యాలరూరల్‌, సెప్టెంబరు 21: నిరుపేదలకు వరం గృహలక్ష్మి పథకమని, కరోనా కారణంగానే ఆలస్యమైందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. జగిత్యాల అర్బన్‌ మండలం తిప్పన్నపేటలోని బీఎల్‌ఎన్‌ గార్డెన్‌లో జగిత్యాల అర్బన్‌ మండలానికి చెందిన 123, రూరల్‌ మండలానికి చెందిన 640 మంది లబ్దిదారులకు ప్రొసీడింగ్‌లు, 59మందికి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంతసురేష్‌లతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గృహలక్ష్మి నిరంతర ప్రక్రియ అని కొంతమంది అర్హులకు లిస్ట్‌లో పేరు రాలేదని తన దృష్టికి వచ్చిందని అర్హులందరికీ వర్తించేలా అధికారులు చొరవచూపాలని ఆదేశించారు. రైతుబంధు, రైతుబీమా, మిషన్‌కాకతీయ, రుణమాఫీ వంటి గొప్ప కార్యక్రమాలు చేపట్టి రైతును రాజును చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ అమలు చేశారని పేర్కోన్నారు. దివ్యాంగులకు 4 వేల పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు.

సొంతింటి కల సీఎం నెరవేర్చారు : ఎమ్మెల్సీ ఎల్‌. రమణ

గృహలక్ష్మి పథకం ద్వారా సీఎం కేసీఆర్‌ సొంతింటి కల నెరవేర్చారని ఎమ్మెల్సీ ఎల్‌. రమణ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో 4,520 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేపట్టడంలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ పాత్ర ఎంతో ఉందని అన్నా రు. కంటిచూపు సమస్యలు ఉన్న నిరుపేదలకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్న గొప్ప వ్యక్తి ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అని ఎమ్మెల్యే సేవలను ఎమ్మెల్సీ ఎల్‌. రమణ కొనియాడారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయంపై తెలంగాణ ప్రభు త్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు ఉప యోగించుకోవాలని, బీఆర్‌ఎస్‌కు వచ్చే ఎన్నికల్లో పట్టం కట్టాలని కోరారు. ఎమ్మెల్యేగా సంజయ్‌కుమార్‌ను గెలిపించాలని కోరారు.

అభివృద్ధి సంక్షేమం కేసీఆర్‌తోనే సాధ్యం : జడ్పీ చైర్‌పర్సన్‌

అభివృద్ధి, సంక్షేమం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంతసురేష్‌ అన్నారు. ఆడబిడ్డలు కలిసికట్టుగా ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ను గెలిపించాలని కోరారు. మహిళలు కేసీఆర్‌కు అండగా నిలువాలని కోరారు. కేసీఆర్‌ లాంటి ముందుచూపున్న నాయకుడు సీఎం కావడం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు. కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్‌ చంద్రశేఖర్‌గౌడ్‌ ఎంపీపీలు ములాసపు లక్ష్మీ, ప్యాక్స్‌ చైర్మన్లు జోగినిపెల్లి సందీప్‌రావు, పత్తిరెడ్డి మహిపా ల్‌రెడ్డి, జడ్పీటీసీ మహేష్‌, ఆర్‌బీఎస్‌ కన్వీనర్‌ రవీంధర్‌రెడ్డి, ఎంపీడీఓలు రాజేశ్వరి, శైలజా రాణి, ఎంపీఓలు రవిబాబు, సలీం, రూరల్‌ డీటి వినయ్‌, ఆర్‌ఐ ఖాజీం, అర్బన్‌, రూరల్‌ మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T00:21:41+05:30 IST