బాలిక కోసం ఐదు స్పెషల్ టీంల గాలింపు
ABN , Publish Date - Dec 28 , 2023 | 11:56 PM
కరీంనగర్ శివారులోని పెద్దపల్లి బైపాస్రోడ్డు వద్ద బుధవారం మధ్యాహ్నం బస్సు దిగిన బాలిక(12) కరీంనగర్లోని ఆమె ఇంటికి చేరకపోవడంతో ఆమె తండ్రి కరీంనగర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు.
కరీంనగర్ క్రైం, డిసెంబరు 28 : కరీంనగర్ శివారులోని పెద్దపల్లి బైపాస్రోడ్డు వద్ద బుధవారం మధ్యాహ్నం బస్సు దిగిన బాలిక(12) కరీంనగర్లోని ఆమె ఇంటికి చేరకపోవడంతో ఆమె తండ్రి కరీంనగర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. ఈ మేరకు బాలిక ఆచూకీ కనుగొనేందుకు ఐదు పోలీసు స్పెషల్టీంలు రంగంలోకి దిగాయి.
కరీంనగర్ రూరల్ ఏసీపీ టి కరుణాకర్రావు ఆధ్వర్యంలో స్పెషల్టీంలు కరీంనగర్ నుంచి గోదావరిఖని, పెద్దపల్లి, జగిత్యాల, హైదరాబాద్ మార్గాలలో వెదుకుతున్నారు. అన్ని ఆర్టీసీ బస్టాండ్ల లోని సీసీ కెమెరాలతో పాటు రహదారిపైన ఉన్న సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. బాలిక హైదరాబాద్, జగిత్యాలకు ఆర్టీసీ ఉచిత బస్సులో ప్రయాణించిందని పోలీసుల విచారణలో గుర్తించి నట్లు సమాచారం. కాని ఆ బాలిక ప్రస్తుతం ఎక్కడ ఉన్నదనే విషయం ఇంకా తెలియరాలేదు. పెద్దపల్లిలోని బాలికను ఆమె తాత బస్సు ఎక్కించి కరీంనగర్ పంపించగా మంచిర్యాల చౌరస్తాలో దిగాల్సిన బాలిక పెద్దపల్లి బైపాస్రోడ్లో ఆమె ఎందుకు బస్సు దిగింది? ఎవరైనా వెంట ఉన్నారా? లేదా మరే కారణంగానైనా అర్ధాంతరంగా బస్సు దిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. గాలింపు ముమ్మరం చేశామని, కొంత సమాచారం సేకరించామని పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి తెలిపారు.