నత్తనడకన ఈ-శ్రమ్ నమోదు
ABN , First Publish Date - 2023-02-24T01:08:34+05:30 IST
అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ-శ్రమ్ నమోదు ప్రక్రియ జిల్లాలో నత్తనడకగా సాగుతోంది. 2021 ఆగస్టులో ప్రారంభమైన ఈ పథకంలో చేరడానికి కార్మికులు అవగాహన లేక అనాసక్తి చూపుతున్నారు.
- అవగాహన లేక కార్మికుల అనాసక్తి
- కార్మికులకు అందని బీమా సౌకర్యం
- జిల్లాలో 2.98 లక్షల మంది కార్మికులు
- అర్హులు 1.90 లక్షల మంది
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ-శ్రమ్ నమోదు ప్రక్రియ జిల్లాలో నత్తనడకగా సాగుతోంది. 2021 ఆగస్టులో ప్రారంభమైన ఈ పథకంలో చేరడానికి కార్మికులు అవగాహన లేక అనాసక్తి చూపుతున్నారు. కార్మికశాఖ కార్మికుల్లో అవగాహన పెంచడానికి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా నామమాత్రపు ఫలితాలే కనిపిస్తున్నాయి. 16నుంచి59 ఏళ్ల వయస్సు ఉండి అసంఘటిత రంగంలో ఉన్న శ్రమజీవులందరూ ఈ-శ్రమ్లో నమోదు చేసుకోవడానికి అర్హులు. నమోదైన కార్మికులకు 12 అంకెల ప్రత్యేక యూనివర్సల్ ఐడెంటీఫికేషన్ నంబర్తో కేంద్రప్రభుత్వం గుర్తింపు కార్డును అందిస్తోంది. నమోదు చేసుకున్న ప్రతీ కార్మికుడికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కార్మికులు మరణిస్తే రెండు లక్షల రూపాయల బీమా లభిస్తుంది. శాశ్వత వైకల్యం ఏర్పడితే లక్ష రూపాయల ప్రమాద బీమా పొందుతారు. దీంతో పాటు కార్మికులకు కేంద్ర ప్రభుత్వం కల్పించే వివిధ పథకాలకు ప్రాధాన్యం కూడా కల్పిస్తారు. వ్యవసాయ కూలీలు, అడ్డా కూలీలు, మత్స్యకారులు, భవన నిర్మాణ రంగాల్లో పనిచేసే కార్మికులు వడ్డెరలు, సెంట్రింగ్, ఫ్లంబింగ్, శానిటరీ, పేయింటింగ్, ఎలక్ర్టీషీయన్, వెల్డింగ్, ఇటుక బట్టీ, పవర్లూం, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు ఉపాధిహామీ కూలీలు, అంగన్వాడీలు, అశావర్కర్లు, అటో డ్రైవర్లు, కూరగాయలు, పండ్లు అమ్ముకునే వ్యాపారులు, టైలరింగ్, స్వర్ణకారులు, బ్యూటీ పార్లర్లలో పనిచేసే కార్మికులతో పాటు కొరియర్ బాయ్స్, విద్యావలంటీర్లు అందరూ ఈ పథకానికి అర్హులే. ఈపీఎఫ్, ఈఎస్ఐలో లేని వారందరూ ఈ-శ్రమ్లో నమోదు చేసుకోని సౌకర్యాలు పొందే వీలు ఉంది.
- జిల్లాలో 62,560 మంది నమోదు
జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 5,52,037మంది జనాభా ఉండగా రెండు లక్షల 98 వేల 663 మంది కార్మికులు ఉన్నారు. ఇందులో ప్రధాన కార్మికులు 2.53 లక్షల మంది ఉన్నారు. వ్యవసాయ రంగంలో రైతులు 66,751 మంది, వ్యవసాయ కూలీలు 1,01,737 మంది, కుటీర పరిశ్రమ కార్మికులు 46,647 మంది, ఇతర రంగాల్లో 83,528 మంది పనిచేస్తున్నారు. ఇందులో ప్రధానంగా 1.90 లక్షల మంది కార్మికులు ఈ- శ్రమ్లో నమోదుకు అర్హులుగా ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ఇప్పటి వరకు 57,968 మంది మాత్రమే నమోదయ్యారు. ఈ-శ్రమ్ పోర్టల్లో కార్మికులు నమోదు చేసుకోవడానికి ఉచితంగానే అవకాశం కల్పించారు. కార్మికులకు అవగాహన లేకపోవడంతో నమోదు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. జిల్లా కేంద్రంలో ప్రధానంగా టెక్స్టైల్ రంగంలో దాదాపు ప్రత్యక్షంగా, పరోక్షంగా పదివేల మంది కార్మికులు పనిచేస్తే 572 మంది మాత్రమే నమోదు కావడం గమనార్హం. పవర్లూం నేత కార్మికులు 362 మంది, స్పిన్నింగ్, అండ్ వైడింగ్లో 1,011 మంది నమోదయ్యారు. వ్యవసాయరంగంలో 33,900 మంది, నమోదు కాగా వ్యవసాయ కార్మికులు 25,545 మంది ఉన్నారు. ఇతర రంగాల్లో చూస్తే నమోదు మరి అధ్వానంగా ఉంది.