రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Dec 18 , 2023 | 12:26 AM
దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం ఆదివారం నాడు భక్తులతో రద్దీగా మారింది.
వేములవాడ, డిసెంబర్ 17 : దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం ఆదివారం నాడు భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్ట దైవమైన రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకొని తరించారు. తొలుత ఆలయ కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి, ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి ప్రవేశించి రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా లఘు దర్శనం అమలు చేయడంతో భక్తులు నందీశ్వరుడి వద్ద నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. కళాభవన్లో శ్రీ స్వామివారి నిత్య కళ్యాణం, సత్యనారాయణ వ్రతం, బాలాత్రిపుర సుందరి దేవి ఆలయంలో కుంకుమ పూజ తదితర ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును పెద్ద సంఖ్యలో భక్తులు చెల్లించుకున్నారు. అనుబంధాలయమైన బద్దిపోచమ్మ దేవాలయం సైతం భక్తులతో క్రిక్కిరిసిపోయింది. వందలాది మంది భక్తులు బద్దిపోచమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.