కేసుల పరిష్కారానికి రాజీయే రాజమార్గం
ABN , First Publish Date - 2023-06-11T00:20:28+05:30 IST
కేసుల పరిష్కా రానికి కక్షిదారులకు రాజీయే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా లీగల్ సర్వీసెస్ అఽథారిటీ చైర్ పర్సన్ ఎన్.ప్రేమలత అన్నారు.
సిరిసిల్ల క్రైం, జూన్ 10: కేసుల పరిష్కా రానికి కక్షిదారులకు రాజీయే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా లీగల్ సర్వీసెస్ అఽథారిటీ చైర్ పర్సన్ ఎన్.ప్రేమలత అన్నారు. శనివారం జిల్లా కోర్టు సముదాయంలో జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్ ఉన్న కేసుల్లో దాదాపు 1041 కేసులు పరిష్కారం అయ్యాయని అన్నారు. ఇందుకు పలు కేసుల్లో 49 లక్షల 54 వేల 415 రూపాయలు చెల్లింపులు జరిగాయన్నారు. ఇం దులో సిరిసిల్లలోని జిల్లా కోర్టులో 2, 1వ ఏడీజే కోర్టులో 2, పీడీఎం కోర్టులో 91, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో 591, బ్యాంకు పీఎల్సీలు 22, వేములవాడ కోర్టులో 246 కేసులు పరిష్కారమైనట్లు చెప్పారు. రాజీ మార్గం ఉన్న క్రిమినల్, అన్ని సివిల్ కేసులకు లోక్ అదాలత్లో పరిష్కారం లభించిందన్నారు. భూ తగాదాలు, బ్యాంకు రుణాలు, కుటుంబ కలహాలు వంటి కేసుల్లో లోక్ అదాలత్ సేవలు వినియోగించు కోవాలన్నారు. ఇరువర్గాల్లోని కక్షిదారుల్లో ఎవరికైన ఆర్థిక స్థోమత లేకపోతే న్యాయసేవా సంస్థను సంప్ర దిస్తే సేవలు అందిస్తుందన్నారు. ఒకసారి లోక్ అదాల త్లో కేసు పరిష్కారమైతే ఆ కేసులో ఏ కోర్టుకు వెళ్లే అవకాశం లేదన్నారు. ప్రతీ శనివారం నిర్వహించే లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని, లోక్ అదాలత్ తీర్పు అంతిమమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీలేఖ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి హిమబింధు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోడి లక్ష్మణ్, లోక్ అదాలత్ సభ్యులు చింతోజి భాస్కర్, పెంట శ్రీనివాస్, కోర్టు కానిస్టేబుళ్లు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
వేములవాడ : జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని వేములవాడ సీనియర్ సివిల్ జడ్జి సత్తు రవీందర్ అన్నారు. వేములవాడ కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. 246 కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్లో కేసులను పరిష్కరించేందుకు పోలీసులు కృషి చేయాలని, రాజీకి అవకాశం ఉన్న కేసులలో కక్షిదారులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి, ఏపీపీ విక్రాంత్, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.