ఆపరేషన్ చొప్పదండి
ABN , First Publish Date - 2023-08-03T01:03:25+05:30 IST
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార బీఆర్ఎస్ పార్టీ అసంతృప్తి సెగలను చల్లార్చే ప్రయత్నాలను ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలం పుంజుకుంటున్నదని అందుతున్న సమాచారం మేరకు అప్రమత్తమైన బీఆర్ఎస్ అధిష్ఠానం ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు నియోజకవర్గాలపై దృష్టి సారించింది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార బీఆర్ఎస్ పార్టీ అసంతృప్తి సెగలను చల్లార్చే ప్రయత్నాలను ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలం పుంజుకుంటున్నదని అందుతున్న సమాచారం మేరకు అప్రమత్తమైన బీఆర్ఎస్ అధిష్ఠానం ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు నియోజకవర్గాలపై దృష్టి సారించింది. ఎమ్మెల్యేలకు, ద్వితీయ శ్రేణి నాయకులు, ప్రజాప్రతినిధులకు మధ్య విభేదాలు, అసంతృప్తి ఉంటే వాటిని పరిష్కరించి నియోజకవర్గంలో టికెట్ ఎవరికి వచ్చినా గెలిపించాలని శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నది. ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నాలు చేస్తూ అప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ నేతల అసంతృప్తి
శాసనసభ్యుడు సుంకె రవిశంకర్కు వ్యతిరేకంగా ఇప్పటికే నలుగురైదుగురు టికెట్ ఆశిస్తూ నియోజకవర్గంలో పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొన్నది. ఎమ్మెల్యే వ్యవహారశైలిపై నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కొందరు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తుండడంతోపాటు అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లడంతో దీనికి అడ్డుకట్ట వేయాలని నాయకత్వం భావించింది. నియోజకవర్గంలో పార్టీ నిర్వహించిన సర్వేలో బీఆర్ఎస్కు 50 శాతం సానుకూలత ఉన్నా ఎమ్మెల్యేకు 35 శాతం మాత్రమే ప్రజామోదం లభించిందని పార్టీ వర్గాల సమాచారం. ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో ఎమ్మెల్యే రవిశంకర్కు ఉన్న విబేధాలను పరిష్కరిస్తే ఆయన గ్రాఫ్ను కూడా 50 శాతానికి పెంచి నియోజకవర్గంలో విజయాన్ని నమోదు చేయవచ్చని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. ఇక్కడ అభ్యర్థిని మార్చాలా, వద్దా అన్న విషయంలో ఇంకా ఏ నిర్ణయం జరగకపోయినా నేతల మధ్య విభేదాలను తొలగించి అభ్యర్థి ఎవరైనా బీఆర్ఎస్ గెలిచి తీరాలనే లక్ష్యాన్ని నాయకులు, శ్రేణుల ముందు ఉంచేందుకు పార్టీ ప్రయత్నిస్తున్నది. జిల్లా మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఈ కాయకల్ప చికిత్సకు బుధవారం శ్రీకారంచుట్టారు. పట్టణంలోని ఒక హోటల్లో ఎమ్మెల్యే రవిశంకర్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, నియోజకవర్గ నాయకులు వీర్ల వెంకటేశ్వర్రావు, రాజనర్సింగరావు, ఏనుగు రవీందర్ రెడ్డితో భేటీ అయ్యారు. వీరిలో పలువురు గతంలో ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వవద్దని వినోద్కుమార్కు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్నదేమిటి, ప్రస్తుత పరిస్థితికి కారణాలేమిటి, ఏం చేస్తే పరిస్థితి మెరుగు పడుతుంది అన్న విషయంలో మంత్రి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నేతలతో చర్చించినట్లు తెలిసింది. నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలకు చెందిన ముఖ్య నేతల నుంచి వారు అభిప్రాయ సేకరణ చేసి పార్టీ నేతల మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చి పార్టీ అభ్యర్థి విజయానికి దోహదపడే విధంగా చర్యలకు ఆలోచన చేశారని సమాచారం. ఈ సమావేశంలో కొందరు రవిశంకర్కు టికెట్ ఇవ్వవద్దని కోరినట్లు సమాచారం. మంత్రి గంగుల కమలాకర్, వినోద్ కుమార్ పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపు కోసం అందరూ కృషి చేయాలని సూచించారని తెలిసింది.