విష వాయువులకు చెక్
ABN , First Publish Date - 2023-02-10T00:44:16+05:30 IST
థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే విష వాయులను నిరోధించేందుకు ఎన్టీపీసీ కృషి చేస్తున్నది.
జ్యోతినగర్, ఫిబ్రవరి 9 : థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే విష వాయులను నిరోధించేందుకు ఎన్టీపీసీ కృషి చేస్తున్నది. బొగ్గు మండించడం ద్వారా వెలువడుతున్న సల్ఫర్ డైయాక్సైడ్(గంధకం) వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది. ఈ విష వాయువుల వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడి ప్రజలకు హానిచేస్తుంది. ఈ సల్ఫర్ డైయాక్సైడ్ సమస్యను నివారించాలనే ఉద్దేశంతో ఇక్కడి రామగుండం ఎన్టీపీసీ, తెలంగాణ ఎస్టీపీపీలలో ఎఫ్జీడీ(ఫ్లూగ్యాస్ డీ సల్ఫరైజేషన్)లను ఏర్పాటు చేస్తున్నారు. ఎఫ్జీడీలను థర్మల్ విద్యుత్ కేంద్రాలలో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించడంతో ఎన్టీపీసీ సైతం ఎఫ్జీడీల నిర్మాణాలను చేపట్టింది. తెలంగాణ సూపర్ థర్మల్ ప్రాజెక్టులో ఇప్పటికే ఎఫ్జీడీ నిర్మాణం పూర్తికాగా, రామగుండం ప్రాజెక్టులో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సుమారు 1709 కోట్ల రూపాయల వ్యయంతో ఎఫ్జీడీలను నెలకొల్పుతున్నారు.
ఎఫ్జీడీలు ఎందుకు?
బొగ్గు ఆధారిత ద్యుత్ కేంద్రాలలో ఉన్న చిమ్నీల ద్వారా విష వాయువుల ఉద్గారం ఉంటుంది. ఈ విషవాయువులను పూర్తిస్థాయిలో నియంత్రించడానికే ఫ్లూగ్యాస్ డీసల్ఫరైజేషన్(ఎఫ్జీడీ) అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. థర్మల్ కేంద్రాల నుంచి వెలువడే విష వాయువులను సంగ్రహించి ఇతర అవసరాలకు వినియోగించడానికి ఎఫ్జీడీల నిర్మాణం చేపట్టాలని కేంద్ర సంస్థ సీఈసీ(సెంట్రల్ ఎలక్ట్రిసిటీ కమిషన్) కొత్త నిబంధన తీసుకువచ్చింది. దీనిలో భాగంగా 2015 డిసెంబరులో సీఈఏ(సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ) దేశవ్యాప్తంగా ఉన్న 12 థర్మల్ విద్యుత్ కేంద్రాలలో ఎప్జీడీలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టులోని 7 యూనిట్లలో ఎఫ్జీడీలు ఏర్పాటుచేయాలని సీఈఏ సూచించింది. 2024నాటికి వీటిని అందుబాటులోకి తేవాలని పేర్కొంది.
రామగుండం ప్లాంటులో..
2600 మెగావాట్ల సామర్థ్యంగల రామగుండం ఎన్టీపీసీలో ఎఫ్జీడీ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 1400 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఎఫ్జీడీ నిర్మాణ పనులు 2022లో మొదలయ్యాయి. ఈ ప్రాజెక్టు 200 మెగావాట్ల 3 యూనిట్లు కలిపి ఒక చిమ్నీ, 500 మెగావాట్ల 4 యూనిట్లకు 4 చిమ్నీలున్నాయి. వీటికి సమాంతరంగా ఎఫ్జీజీ లో భాగంగా మరో 5 చిమ్మీల నిర్మాణం జరుగుతున్నది. ఈ ఏడాదిలో ఎఫ్జీడీలను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
టీఎస్టీపీపీలో పూర్తి..
ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 1600 మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు(టీఎస్టీపీపీ)లో ఎఫ్జీడీల నిర్మాణం పూర్తయింది. కొత్త ప్రాజెక్టు కావడతో ఈ ప్లాంటులో మొదటి నుంచే ఎఫ్జీడీ నిర్మాణాన్ని సైతం చేపట్టారు. 309 కోట్ల రూపాయల వ్యయంతో ఎఫ్జీడీని పూర్తి చేశారు.
ఎఫ్జీడీ పనితీరు..
విద్యుత్ కేంద్రం చిమ్నీ నుంచి బహిర్గతమయ్యే ఫ్లైయాష్తో కూడిన వాయువులో ఉన్న సల్ఫర్ డైయాక్సైడ్(ఎస్వో2) ఎఫ్జీడీ ఒడిసి పడుతుంది. దీని నుంచి తడి సున్నం(కాల్షియం)ను ఒదలడం ద్వారా జరిగే రసాయన చర్య వల్ల అది జిప్సంగా మారి కింద పడుతుంది. ఇలా ఎన్టీపీసీ ద్యుత్ కేంద్రం నుంచి వెలువడే ప్రమాదకరమైన సల్ఫర్ డైయాక్సైడ్ను 98 శాతం ఎఫ్జీడీ వల్ల నిరోధించ వచ్చని తెలుస్తుంది. టీఎస్టీపీపీ పూర్తయితే సల్ఫర్ డైయాక్సైడ్ నుంచి రోజుకు 1000 టన్నుల జిప్సంను ఉత్పత్తి చేయనున్నారు.
జిప్సంతో ఉపకరణాలు తయారీ..
ఎన్టీపీసీ ప్రాజెక్టులో ఎఫ్జీడీ వల్ల ఉత్పత్తి అయ్యే జిప్సంతో అనేక ఉపకరణాలను తయారుచేయవచ్చు. జిప్సం వాల్బోర్డులు, గ్లాస్ ఫైబర్, జిప్సం ప్యానళ్లు, సిమెంటు పరిశ్రమల్లో జిప్సంను ఉపయోగిస్తారు. అలాగే పంట పొలాల్లో భూసారానికి, లోపాలుంటే జిప్సంను వినియోగిస్తారు.