ఇంటింటికీ ‘ఆయుష్మాన్ భవ’
ABN , First Publish Date - 2023-09-22T00:43:11+05:30 IST
వైద్యసేవలను ప్రజల వద్దకే తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆయుష్మాన్ భవ’ పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఢిల్లీలో ప్రారంభించారు. ఇందులో భాగంగా దే శవ్యాప్తం గా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు రెండు వారాల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు.
- హెల్త్కార్డుల పంపిణీ
- విస్తృతంగా ఆరోగ్య శిబిరాల నిర్వహణ
- ప్రతి పల్లెలో సభలు
జగిత్యాల, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): వైద్యసేవలను ప్రజల వద్దకే తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆయుష్మాన్ భవ’ పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఢిల్లీలో ప్రారంభించారు. ఇందులో భాగంగా దే శవ్యాప్తం గా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు రెండు వారాల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. జగిత్యాల జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని సీహెచ్సీలు, పీహెచ్సీలు, యూహెచ్సీలు, వెల్నెస్ కేంద్రాల పరిధిలో కార్యకలాపాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విస్తృతంగా నిర్వహిస్తున్నారు.
ఇంటింటికీ కార్డుల పంపిణీ
ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన ద్వారా గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి వారి వివరాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తారు. కుటుంబ సభ్యులకు ఆభా (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్) కార్డులు అందిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి డివిజన్లలో పలు ప్రాంతాల్లో ఆసుపత్రుల ద్వారా, ప్రత్యేక శిబిరాలను నిర్వహించి ఆభా కార్డులను అందిస్తున్నారు. ఆభా కార్డు ఉంటే దేశవ్యాప్తంగా ఎక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి అయినా ఎలాంటి పత్రాలు లేకుండానే వెళ్లి వైద్యసేవలు పొందవచ్చు.
విస్తృతంగా ఆరోగ్య శిబిరాల నిర్వహణ
ఆయుష్మాన్ భవ ద్వారా జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. ప్రజలకు పలు విభాగాల వైద్య నిపు ణులతో ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నారు. వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ జరిగితే వారికి ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ఉచితంగా చికిత్సలు, మందులు అందించడంపై అధికారులు దృష్టి సారిస్తారు.
గ్రామాల్లో ఆయుష్మాన్ భవ సభ
ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహించినట్లే ఆయుష్మాన్ సభ నిర్వహి స్తున్నారు. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ తదితర పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న సౌకర్యాలు, అందిస్తున్న వైద్యసేవలను వివరిస్తున్నారు.
అవయవ దానంపై అవగాహన
ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవయవ దానం ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. ఒకరి అవయవాలు మరొకరికి ఎలా పనికి వస్తాయో, ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరిస్తు న్నారు గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలు, ముఖ్యంగా యువకులతో అవయవ దానంపై ప్రతిజ్ఞ చేయించడం వంటి పనులు నిర్వహిస్తున్నారు. అదే విధంగా బీపీ, షుగర్, క్యాన్సర్, కామెర్లు తదితర అన్ని రకాల జీవన శైలి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోగులకు ఉచితంగా మందుల పంపిణీ చేయడమే కాకుండా ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరిస్తున్నారు.
పకడ్బందీగా నిర్వహిస్తున్నాం
- డాక్టర్ ఎన్ శ్రీనివాస్, డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ, జగిత్యాల
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. రెండు వారాల పాటు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలో ఉన్న ప్రజలకు అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకుంటు న్నాం. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పకడ్బందీగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం.