లీగల్ సర్వీసెస్ అథారిటీపై అవగాహన పెంచుకోవాలి
ABN , Publish Date - Dec 31 , 2023 | 12:46 AM
లీగల్ సర్వీస్ అథారిటీ అందించే ఉచిత న్యాయసేవలపై అవగాహన పెంచుకోవాలని, సామాన్య ప్రజలకు సైతం లీగల్ సర్వీస్ అథారిటీ గురించి తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి కం చైర్మన్, లీగల్ సర్వీసెస్ అథారిటీ డి హేమంత్కుమార్ అన్నారు.
పెద్దపల్లి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): లీగల్ సర్వీస్ అథారిటీ అందించే ఉచిత న్యాయసేవలపై అవగాహన పెంచుకోవాలని, సామాన్య ప్రజలకు సైతం లీగల్ సర్వీస్ అథారిటీ గురించి తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి కం చైర్మన్, లీగల్ సర్వీసెస్ అథారిటీ డి హేమంత్కుమార్ అన్నారు. శనివారం పెద్దపల్లిలో ని రంగంపల్లి కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో హేమంత్ కుమార్, లీగల్ సర్వీసెస్ అధారిటీ కార్యదర్శి ఎం అర్జున్తో కలిసి పాల్గొన్నారు. లోక్ అధాలత్ కేసులో వచ్చిన వివిధ కేసులను పరిశీలించారు. హేమంత్ కుమార్ మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం దేశంలోని ప్రతి పౌరుడికి ఉచిత న్యాయ సేవలు అందించే దిశగా లీగల్ సర్వీసెస్ అథారిటీని ఏర్పాటు చేశారన్నారు. సీనియర్ సివిల్ జడ్జి, లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి ఎం అర్జున్ మాట్లాడుతూ ప్రజలు తెల్ల కాగితంపై దరఖాస్తు సమర్పిస్తే వారికి న్యాయవాదిని ఏర్పాటు చేసి ఉచిత న్యాయ సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్ భాస్కర్, కార్యదర్శి రెడ్డి శంకర్, వైస్ ప్రెసిడెంట్ డివిఎస్ మూర్తి, సంయుక్త కార్యదర్శి కే. వాసు, గ్రంథాలయ కార్యదర్శి బి సంతోష్ కుమార్, క్రీడా సాంస్కృతిక కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు.
సుల్తానాబాద్: సుల్తానాబాద్ కోర్టులో శనివారం జాతీయ లోక్ ఆదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి జిఎస్ఎల్ ప్రియాంక మాట్లాడారు. క్షణికావేశంలో చేసిన నేరాలకు మీ విలువైన జీవితాలను సమయాన్ని కేసుల కోసం కోర్డుల చుట్టూ తిరిగి పాడుచేసుకోవద్దని అన్నారు. లోక్ అధాలత్లో దాదాపు 850 కేసులను పరిష్కరించినట్లు కోర్టు అధికారులు తెలిపారు. బార్ అసోసియోషన్ ప్రదాన కార్యదర్శి జోగుల రమేష్, ఏపీపీ శ్యామ్ ప్రసాద్, ఏజీపి తిరుపతి రెడ్డి, లోక్ ఆదాలత్ సభ్యులు పాల్గొన్నారు.