వానాకాలం నీటి విడుదలపై త్వరలో కార్యాచరణ
ABN , First Publish Date - 2023-06-03T00:51:29+05:30 IST
వానాకాలం పంటలకు సబంధించిన నీటి విడుదలపై కార్యాచరణ రూపొందిస్తున్నామని, ఈ విషయాన్ని త్వరలో రైతులకు తెలియజేస్తామని ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ శంకర్ తెలిపారు.
-ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ శంకర్
తిమ్మాపూర్, జూన్ 2: వానాకాలం పంటలకు సబంధించిన నీటి విడుదలపై కార్యాచరణ రూపొందిస్తున్నామని, ఈ విషయాన్ని త్వరలో రైతులకు తెలియజేస్తామని ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ శంకర్ తెలిపారు. శుక్రవారం మండలంలోని ఎల్ఎండీ కాలనీలో గల ఈఎన్సీ కార్యాలయంలో ఆయన విలేకరుల తో మాట్లాడారు. కరీంనగర్ ఈఎన్సీ పరిధిలో 2729 జలాశయాలున్నాయన్నారు. వాటిలో 660 జలాశయాలు 0 నుంచి 25 శాతం, 655 జలాశయాలు 25 నుంచి 50, 823 జలాశయాలు 50 నుంచి 75, 589 జలాశయాలు 75 ఉంచి 100 శాతం నీటి నిల్వలతో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం మిడ్ మానేరులో 20.175 టీఎంసీలు, లోయర్ మానేరులో 7.8 టీఎంసీలు, ఎస్సారెస్పీలో 20 టీఎంసీలు, శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్లో 10 టీఎంసీలు, ఎగువ మానేరులో 0.9 టీఎంసీల నీరు నిల్వ ఉందని అన్నారు. జిల్లాలో నీటికి ఎలాంటి ఇబ్బంది లేదని, భూగర్భజలాలు భారీగా పెరిగాయని తెలిపారు. సిబ్బంది కొరత కారణంగా త్వరలో వీఆర్ఏలను ప్రభుత్వం లష్కర్లుగా నియమించనుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. ఈ నెల 7, 8వ తేదీల్లో రెండు రోజుల పాటు నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో సాగు నీటి దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమలను పర్యవేక్షణకు ఎస్ఈలు, డీఈలను నోడల్ ఆఫీసర్లుగా నియస్తున్నామన్నారు. మండలానికి ఒక పెద్ద చెరువును ఎంపిక చేసి అక్కడ ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈలు సుమతిదేవి, డిప్యూటి సీఈ రాధకృష్ణ, డిప్యూటి ఎస్ఈ అస్మత్ అలీ, ఈఈలు జగన్, శ్రీనివాస్ గుప్త, నారాయణ, రాములు పాల్గొన్నారు.