ఏ ప్రభుత్వరంగ సంస్థలో లేని విధంగా వేజ్‌బోర్డు

ABN , First Publish Date - 2023-05-26T00:26:22+05:30 IST

దేశంలో ఏ ప్రభుత్వరంగ సంస్థలో లేని విధం గా బొగ్గు పరిశ్రమల్లో వేజ్‌బోర్డు ఒప్పందం చేయించామని, ఇది చారిత్రాత్మకమైన ఒప్పందమని జాతీయ కార్మిక సంఘాల నాయకులు ఏఐటీయూసీ వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్‌టీయూసీ జనక్‌ ప్రసాద్‌, సీఐటీయూ రాజిరెడ్డి, బీఎంఎస్‌ యాదగిరి సత్తయ్య చెప్పారు.

ఏ ప్రభుత్వరంగ సంస్థలో లేని విధంగా వేజ్‌బోర్డు

గోదావరిఖని, మే 25: దేశంలో ఏ ప్రభుత్వరంగ సంస్థలో లేని విధం గా బొగ్గు పరిశ్రమల్లో వేజ్‌బోర్డు ఒప్పందం చేయించామని, ఇది చారిత్రాత్మకమైన ఒప్పందమని జాతీయ కార్మిక సంఘాల నాయకులు ఏఐటీయూసీ వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్‌టీయూసీ జనక్‌ ప్రసాద్‌, సీఐటీయూ రాజిరెడ్డి, బీఎంఎస్‌ యాదగిరి సత్తయ్య చెప్పారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడు తూ ఈనెల 20న కోల్‌కతాలో జరిగిన వేజ్‌బోర్డు ఒప్పందం మెరుగైందని, దేశంలో ఇతర ప్రభుత్వరంగ సంస్థల్లో పది సంవత్సరాల కాలపరిమితి ఉండి 12శాతం నుంచి 15శాతం వేతనాల పెరుగుదల ఉంటే బొగ్గు పరిశ్రమల్లో ఐదు సంవత్సరాల కాలపరిమితికి ఒప్పించి 19శాతం వేతనాల పెరుగుదలతో పాటు 25శాతం అలవెన్సులపై పెంచి ఒప్పందం చేస్తే ఈ వేజ్‌బోర్డు ఒప్పందం సరిగా లేదని, కార్మికులకు నష్టం జరిగే విధంగా ఉందని టీబీజీకేఎస్‌ విమర్శలు చేయడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జేబీసీసీఐ ఒప్పందాలను అమలు చేయించని టీబీజీకేఎస్‌ కార్మికులకు నష్టం చేస్తూ జాతీయ కార్మిక సంఘాలపై బురదజల్లితే సహించేది లేదని హెచ్చరించారు. సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు హై పవర్‌ కమిటీ వేతనాలు, లేబర్‌ చట్టాలను అమలు చేయాలని ఒప్పందం చేసినట్టు వారు పేర్కొన్నారు. ఈ వేజ్‌బోర్డులో కాం ట్రాక్టు కార్మికుల గురించి మాట్లాడలేదని వేజ్‌బోర్డు ఏం జరిగిందో తెలియని వారు, ఒప్పందంలో ఏముందో చూడనివారు, చదవని వారు జాతీయ సంఘాలను విమర్శిస్తూ కాంట్రాక్టు కార్మికులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వేజ్‌బోర్డు ఒప్పందంపై సంతకం చేసిన హెచ్‌ఎంఎస్‌ నాయకుడు రియాజ్‌ అహ్మద్‌ సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నాడని, జాతీయ కార్మిక సంఘాలను విమర్శించడం బాధకరమని, అలాంటి వ్యక్తి ఒప్పందంపై సంతకం చేశారో చె ప్పాలని వారు డిమాండ్‌ చేశారు. రియాజ్‌ అహ్మద్‌కు కార్మికులే బుద్ధి చెబుతారని, పనికిమాలిన మాటలు మానాలని సూచించారు. విలేకరుల సమావేశంలో నాయకులు రాజ్‌కుమార్‌, మడ్డి ఎల్లయ్య, రంగు శ్రీనివాస్‌, మెండె శ్రీనివాస్‌, రాజమౌళి, శివరాంరెడ్డి, ఆకుల హరిణ్‌, ధర్మపురి, సదానందం, రవీందర్‌, కోటయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T00:26:22+05:30 IST