రాష్ట్రానికిరెండో విమానాశ్రయం వచ్చేనా?
ABN , First Publish Date - 2023-02-02T02:54:07+05:30 IST
హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్కు విమానాశ్రయం కలగానే మిగులుతోంది.
బడ్జెట్లో ప్రకటనతో చిగురిస్తున్న ఆశలు
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్కు విమానాశ్రయం కలగానే మిగులుతోంది. 1980వరకు మామునూరులోని విమానాశ్రయం అందుబాటులో ఉన్నా ఆ తర్వాత ట్రాఫిక్ లేదన్న కారణంతో మూసివేశారు. శంషాబాద్ విమానాశ్రయం తర్వాత తెలంగాణలో రెండో విమానాశ్రయాన్ని వరంగల్లో తీసుకురావాలని రెండు దశాబ్దాల నుంచే ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. 2007లోనే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)-రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. 1,186 ఎకరాలు కావాలని ఏఏఐ కోరింది. 748 ఎకరాలు అందుబాటులో ఉండటంతో అదనంగా మరో 438 ఎకరాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2008లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం తర్వాత పరిస్థితి మారుతూ వచ్చింది. శంషాబాద్ నుంచి 150 కిలో మీటర్లలోపు మరో విమానాశ్రయానికి అనుమతి ఇవ్వకూడదన్నది ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధిచేసిన జీఎంఆర్ సంస్థ నిబంధన. హైదరాబాద్ నుంచి వరంగల్ 150 కి.మీ. పరిధిలోనే ఉండటంతో ఇది ముందుకు వెళ్లడం లేదు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా ప్రభుత్వం అనేకసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. 150 కి.మీ. నిబంధన మినహాయింపు ఇవ్వాలని కోరింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కొత్తగూడెంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు పలుమార్లు ప్రతిపాదనలు కూడా పంపింది. అయితే కేంద్రం నుంచి సానుకూల స్పందన కొరవడింది. తాజాగా బడ్జెట్లో దేశవ్యాప్తంగా 50 చోట్ల ప్రాంతీయ విమానాశ్రయాలు, హెలీపోర్టులను పునరుద్ధరిస్తామని ప్రకటించడంతో మామునూరు విమానాశ్రయం పునఃప్రారంభంపై ఆశలు చిగురించాయి.