వరంగల్‌ సీపీ రంగనాథ్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

ABN , First Publish Date - 2023-03-31T03:10:32+05:30 IST

‘కబ్జాదారుల చెర నుంచి మా ప్లాట్లను కాపాడిన దేవుడు’ అని పేర్కొంటూ వరంగల్‌ పోలీసు కమిషనర్‌(సీపీ) రంగనాథ్‌ చిత్రపటానికి గురువారం పలువురు క్షీరాభిషేకం చేశారు.

వరంగల్‌ సీపీ రంగనాథ్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

ఏళ్లనాటి భూసమస్యను పరిష్కరించడంతో బాధితుల కృతజ్ఞత

వరంగల్‌ సిటీ, మార్చి 30: ‘కబ్జాదారుల చెర నుంచి మా ప్లాట్లను కాపాడిన దేవుడు’ అని పేర్కొంటూ వరంగల్‌ పోలీసు కమిషనర్‌(సీపీ) రంగనాథ్‌ చిత్రపటానికి గురువారం పలువురు క్షీరాభిషేకం చేశారు. ఏళ్లనాటి తమ భూసమస్యను పరిష్కరించినందుకు కృతజ్ఞత తెలియజేశారు. వరంగల్‌ జిల్లా ఏనుమాములలోని బాలాజీనగర్‌ భూ బాధితులు లేబర్‌కాలనీకి వెళ్లే వంద అడుగుల రోడ్డులో ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీనివాస్‌, కోదాటి రమేష్‌, గౌస్‌ బేగం, ఆడెపు భిక్షపతి, రాజు, దేవులపల్లి మల్లేష్‌ తదితరులు కొన్నేళ్ల క్రితం బాలాజీనగర్‌లో స్థలాలు కొనుగోలు చేశారు. అధికార పార్టీకి చెందిన స్థానిక నేత ఒకరు అనుయాయులతో ఆ భూములను ఆక్రమించి ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయమై బాధితులు మంగళవారం సీపీని ఆశ్రయించగా వెంటనే స్పందించిన ఆయన టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దింపారు. పూర్తి విచారణ జరిపిన టాస్క్‌ఫోర్స్‌ బృందం నిజనిర్ధారణ చేసుకుని ఎవరి ప్లాట్లు వారికి అప్పగించాలని కబ్జాదారులను హెచ్చరించింది. హర్షం వ్యక్తం చేసిన బాధితులు.. సీపీ రంగనాథ్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞత తెలియజేశారు.

Updated Date - 2023-03-31T03:10:32+05:30 IST