‘వందే భారత్’కూ ఔటర్ కష్టాలు
ABN , First Publish Date - 2023-02-21T01:25:59+05:30 IST
దక్షిణ మధ్య రైల్వేలో సెమీ హై స్పీడ్ రైలుగా కొత్తగా పట్టాలెక్కిన వందే భారత్కూ ‘ఔటర్ కష్టాలు’ తప్పడం లేదు.
శివారులో అరగంట పాటు నిలిపివేత
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వేలో సెమీ హై స్పీడ్ రైలుగా కొత్తగా పట్టాలెక్కిన వందే భారత్కూ ‘ఔటర్ కష్టాలు’ తప్పడం లేదు. ముందున్న రైళ్లను దాటుకుంటూ వేగంగా వెళుతున్నప్పటికీ టెర్మినల్ స్టేషన్లకు చేరే ముందు శివారులో ఆగిపోతోంది. దీంతో నిర్ణీత సమయానికి గమ్యస్థానం చేరడం లేదు. ఈ రైలును గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే విధంగా రూపొందించారు. అయితే దక్షిణ మధ్య రైల్వేలోని ట్రాక్ సామర్థ్యం గంటకు 130 కిలోమీటర్ల వరకే ఉంది. దీంతో అదే వేగంతో నడిపిస్తామని అధికారులు ప్రకటించినా 70 నుంచి 80 కిలోమీటర్ల వేగం మించడం లేదు. హాల్టింగ్ స్టేషన్లలో నిమిషం కంటే తక్కువే ఆపుతున్నప్పటికీ శివారు ప్రాంతాల్లో మాత్రం ఎక్కువసేపు నిలిపివేస్తున్నారు. లైన్ క్లియర్ కాలేదంటూ చర్లపల్లి, మౌలాలి వద్ద 20-30 నిమిషాల పాటు నిలిపివేస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ రైళ్ల కంటే అధికంగా టికెట్ ఛార్జీ భరిస్తున్నా సమయానికి చేరుకోలేకపోతున్నామని వాపోతున్నారు. విశాఖపట్నంలో సోమవారం ఉదయం 5.45 గంటలకు బయలుదేరిన వందే భారత్ మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్కు చేరుకోవాల్సి ఉండగా 2.45కు గంటలకు వచ్చింది. మౌలాలి వద్ద అరగంట పాటు నిలిపివేశారు. దీంతో హైదరాబాద్లో అత్యవసర పనుల కోసం వస్తున్న ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.