హైదరాబాద్లో యూఏఈ దౌత్య కార్యాలయం
ABN , First Publish Date - 2023-05-25T01:38:19+05:30 IST
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) త్వరలో తెలుగునాట తమ దౌత్య కార్యాలయాన్ని ప్రారంభించనుంది. న్యూఢిల్లీ, ముంబై, తిరుమనంతపురం తర్వాత దేశంలో తమ నాలుగో దౌత్య కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తుంది.
జూన్ 14న ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి !
ప్రతి రోజు 300 వీసాల జారీకి చాన్స్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) త్వరలో తెలుగునాట తమ దౌత్య కార్యాలయాన్ని ప్రారంభించనుంది. న్యూఢిల్లీ, ముంబై, తిరుమనంతపురం తర్వాత దేశంలో తమ నాలుగో దౌత్య కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తుంది. జూన్ 14న ఈ కాన్సులేట్ను ప్రారంభించనుంది. యూఏఈ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి అహ్మద్ అలీ అల్ సయెఖ్ చేతులమీదుగా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు యత్నిస్తున్నామని హైదరాబాద్లో నూతన కాన్సుల్ జనరల్గా నియమితులైన ఆరేఫ్ అల్ నుయేమీ చెప్పారు. హైదరాబాద్ నగరంతో తమకున్న చారిత్రాత్మక సంబంధాల దృష్ట్యా కాన్సులేట్ ఏర్పాటుకు హైదరాబాద్ను ఎంచుకున్నామని తెలిపారు. నూతన కాన్సులేట్లో ప్రతి రోజు 300 వీసాలు జారీ చేస్తామని అంచనా వేస్తున్నామని వెల్లడించారు.
నిజానికి, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కీలక గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల కాన్సులేట్లను హైదరాబాద్లో నెలకొల్పాలని ప్రయత్నిస్తుంది. హైదరాబాద్లో కాన్సులేట్ను ఏర్పాటు చేయాలని 2016లో భారత్ పర్యటనకు వచ్చిన యూఏఈ విదేశీ వ్యవహారాల మంత్రి, ఆబుధాబి రాజు సోదరుడైన షేఖ్ అబ్దుల్లా జయాద్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా కోరారు. దుబాయి, ఆబుధాబి షార్జాతో పాటు మొత్తం ఏడు రాజ్యాలు ఉన్న యూఏఈకి తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం వందలాది మంది వెళుతుంటారు.