‘అమ్మా’.. అని పిలిచేవారుండరేమోనని..
ABN , First Publish Date - 2023-02-21T01:21:49+05:30 IST
కవలలకు (బేబీ బాయ్, గర్ల్) జన్మనిచ్చిన ఆ మాతృమూర్తి సంతోషానికి అవధుల్లేవ్.
కవలలను సంప్లో పడేసి.. తల్లి ఆత్మహత్య
గతంలో కవలలు మృతి, అబార్షన్
అల్వాల్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): కవలలకు (బేబీ బాయ్, గర్ల్) జన్మనిచ్చిన ఆ మాతృమూర్తి సంతోషానికి అవధుల్లేవ్. హత్తుకుని ముద్దాడింది. 34 వారాల్లోనే (ప్రి మెచ్యూర్) డెలివరీ కావడంతో బేబీ బాయ్ బలహీనంగా ఉన్నాడని వైద్యులు చెప్పడంతో కుంగిపోయింది. మూడు రోజుల చికిత్స తర్వాత బిడ్డ ఆరోగ్యం బాగుందని అనగానే కవలలతో సంతోషంగా ఇంటికి వెళ్లింది. ఏమైందో ఏమో కానీ.. తొమ్మిది రోజుల తర్వాత నవజాత శిశువులను ఇంట్లో ఉన్న సంపులో వేసి తానూ అందులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకరమైన సంఘటన ఆదివారం అర్ధరాత్రి అల్వాల్ పోలీ్సస్టేషన్ పరిధిలో జరిగింది.
స్టేషన్ హౌస్ ఆఫీసర్ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. కానోజిగూడ, శివానగర్ ప్రాంతానికి చెందిన బేడ సంధ్యారాణి (29)కి నర్సింగ్రావుతో 2012, ఆగస్టులో వివాహమైంది. వారిది మేనరికం. ఐదేళ్ల తర్వాత దంపతులకు ఇద్దరు కవలలు పుట్టి చనిపోయారు. 2018లోనూ అబార్షన్ అయింది. అప్పటి నుంచీ సంధ్యారాణి మానసికంగా కుంగిపోయింది. ఈ పరిస్థితుల్లోనే ఈ నెల 11న మళ్లీ కవలలకు జన్మనిచ్చింది. దీంతో ఆనందంతో మురిసిపోయింది. ఏమైందో గానీ ఆదివారం మధ్యరాత్రి ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత సంపులోని నీటిలో కవలలను పడేసిన సంధ్యారాణి తానూ దూకి ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఉదయం భార్యాపిల్లలు కనిపించకపోవడంతో నర్సింగరావు ఆందోళనకు గురయ్యాడు. సంపు కవర్ తీసి ఉండటంతో అనుమానంతో అందులోకి తొంగి చూడగా మృతదేహాలు కనిపించడంతో కుప్ప కూలిపోయాడు. అల్వాల్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తన చావుకు ఎవరూ కారణం కాదని పేర్కొంటూ సంధ్యారాణి రాసిన సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. గతంలో జన్మించిన కవలలు చనిపోవడం, ఆ తర్వాత అబార్షన్ కావడంతో ఇప్పుడు జన్మించిన శిశువుల ఆరోగ్యం ఎలా ఉంటుందోనన్న ఆందోళనతో ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లుగా పోలీసులు, కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.