‘బాల వికాస’ సేవలు అభినందనీయం
ABN , First Publish Date - 2023-01-24T03:52:12+05:30 IST
ప్రజల సమష్టి కృషితోనే సమాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
స్వచ్ఛంద సంస్థ జాతీయ మహాసభలో మంత్రి హరీశ్రావు
పాల్గొన్న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, మల్లారెడ్డి
ఏపీ నుంచి పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు
కీసర, జనవరి 23: ప్రజల సమష్టి కృషితోనే సమాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మేడ్చల్ జిల్లాలో కీసర మండలంలోని రాంపల్లి దాయరలో ‘బాల వికాస’ సేవా సంస్థ జాతీయ మహాసభను సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, మల్లారెడ్డి, ఏపీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. సభలో హరీశ్రావు మాట్లాడుతూ, బాల వికాస సంస్థ వ్యవస్థాపకులు బాల, ఆండ్రూస్ సమాజానికి చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. బాల వికాస కేంద్రంతో తనకు 15 ఏళ్లుగా అనుబంధం ఉందని, వారు ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లు, వారి ఆధ్వర్యంలో నిర్వహించిన చెరువుల పూడికతీత కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకునే తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కార్యక్రమాలను చేపట్టిందని చెప్పారు. ఇప్పటికీ గ్రామాల్లో ఫ్లోరైడ్ నీటి బాధలు తప్పట్లేదని, దీన్ని గుర్తించిన బాల వికాస కేంద్రం నిర్వాహకులు 1,500 వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఎనలేని సేవలు చేస్తున్నారని ఆయన అభినందించారు. మహిళలను చైతన్యమంతులను చేయడంలో బాల వికాస కేంద్రం ముందుంటుందని, మహిళల ఆర్థికాభివృద్ధికి సంస్థ నిర్వాహకులు కృషిచేయడం అభినందనీయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. దేశవ్యాప్తంగా బాల వికాస సంస్థ తన సేవలను మరింత విస్తృతం చేయాలని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ కేంద్రం ద్వారా ఎంతో మందికి లబ్ధి చేకూరిందని, రానున్న రోజుల్లో ప్రజలకు మరిన్ని సేవలందించాలని ఆయన కోరారు. సంస్థలు స్థాపించడం కన్నా వాటిని నిర్వహించడం ముఖ్యమని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.